కార్పోరేట్ లీక్: సూత్రధారి లోకేష్ అరెస్ట్, జైన్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: కార్పోరేట్ లీక్ కేసులో సోమవారం మరో అరెస్టు జరిగింది. గూఢచర్యం కేసులో విచారణ జరిగేకొత్తి మరిన్ని అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన రహస్య సమచారాన్ని కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో ఢిల్లీ నేర విభాగం పోలీసులు సోమవారం మరొకరిని అరెస్టు చేశారు.
నోయిడాకు చెందిన ఇన్ ఫ్రాలైన్ కన్సల్టెంన్సీ సంస్థలో పని చేస్తున్న లోకేష్ శర్మను అరెస్టు చేశారు. అతని నుంచి బొగ్గు, విద్యుత్, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని నుండి ఓ నకిలీ ప్రభుత్వ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో లోకేష్ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బొగ్గు, విద్యుత్, చమురు మంత్రిత్వ శాఖల్లో పని చేసే కొందరు ఉద్యోగుల సహకారంతో లోకేష్ రహస్య సమాచారాన్ని దొంగిలిస్తున్నాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తదుపరి విచారణ కోసం కోర్టు అనుమతితో అతనిని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు.
అగ్ని ప్రమాదం
కార్పోరేట్ లీక్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన కన్సల్టెంట్ ప్రయాస్ జైన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 18న జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో సంస్థకు చెందిన పలు ఆస్తులు నష్టపోయినట్లుగా సమాచారం.