జూపార్కులో మరణ మృదంగం: 25 రోజుల్లో మూడు ఏనుగులు మృత్యువాత: పొట్టన పెట్టుకున్న వైరస్
భువనేశ్వర్: దేశంలోనే అతి పెద్ద జులాజికల్ పార్కుల్లో ఒకటైన నందన్ కానన్ జూపార్కులో మరణ మృందంగం మోగుతోంది. భయానక వైరస్ జూపార్కును చుట్టుముట్టింది. ఈ వైరస్ బారిన పడి మూడు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. 25 రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అధికారులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఏనుగులకు భయానక హెర్పస్ వైరస్ సోకినట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ వైరస్ కు మందు కూడా లేదని, ఇప్పటి దాకా వాడిన ఔషధాల వల్ల వాటి ఆరోగ్యం మెరుగు పడలేదని వారు వెల్లడించారు. ఈ ఘటన తరువాత జూపార్కులో మిగిలి ఉన్న అయిదు ఏనుగులను సురక్షిత ప్రదేశానికి తరలించాలని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది.
సెక్స్ స్కాండల్: విద్యార్థినిపై ఏడాది కాలంగా అత్యాచారం: కటకటాల వెనక్కి బీజేపీ నేత!
25 రోజుల్లో.. మూడు ఏనుగులు
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో 437 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ జులాజికల్ పార్కు విస్తరించి ఉంది. 1979లో ఏర్పాటైన ఈ జూపార్కులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. జూపార్కులు, అక్వేరియాల పరిరక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన సమాఖ్య సభ్యత్వాన్ని పొందిన ఏకైక జూపార్కు ఇదొక్కటే. కొద్దిరోజులుగా ఈ జూపార్కులో విషాదకర ఛాయలు అలముకుంటూ వస్తున్నాయి. ఈ జూపార్కులో మొత్తం ఎనిమిది ఏనుగులు ఉండగా.. వాటిల్లో మూడు మృత్యవాత పడ్డాయి. కేవల 25 రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కిందటి నెల 25వ తేదీన జూలీ అనే ఆడ ఏనుగు, ఈ నెల 15వ తేదీన చందన్ అనే మగ ఏనుగు మరణించాయి. తాజాగా కమల అనే ఓ ఆడ ఏనుగు కన్నుమూసింది.
మందులు లేని హెర్పస్ వైరస్..
ఈ ఏనుగు వయస్సు ఏడు సంవత్సరాలే. 2013లో జూపార్కులోనే జన్మించిన ఈ ఆడ ఏనుగుకు కమల అని పేరు పెట్టారు జూపార్కు సిబ్బంది. హెర్పస్ వైరస్ బారిన పడి మరణించడం జూ సిబ్బందిని విషాదంలో ముంచెత్తింది. ఈ వైరస్ ఎలా వ్యాపించిందనే విషయంపై ఆరా తీస్తున్నామని నందన్ కానన్ జూపార్కు డిప్యూటీ డైరెక్టర్ జయంత్ దాస్ తెలిపారు. మరో ఏనుగు కూడా దీని బారిన పడినట్లు గుర్తించామని, పశు సంవర్ధక శాఖ అధికారుల వైద్య సంరక్షణలో ఉంచామని ఆయన అన్నారు. మిగిలి ఉన్న మరో నాలుగు ఏనుగులకు జంతు సంరక్షక నిపుణులతో వైద్య పరీక్షలను చేయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వాటిని జూ పార్కులోనే ఉంచాలా? లేక సురక్షిత ప్రదేశానికి తరలించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
కోరలు పీకిన చిరుత కళేబరం
25 రోజుల వ్యవధిలో మూడు ఏనుగులు మృత్యువాత పడటం అసాధారణ విషయమని ఆయన అన్నారు. ఈ ఘటన తరువాత ఢెంకనాల్ లోని జూపార్కులో కూడా ఏనుగులకు వైద్య పరీక్షలను చేయిస్తున్నట్లు చెప్పారు. ఏనుగుల మరణంపై ప్రభుత్వం సమగ్ర నివేదికను కోరినట్లు తెలిపారు. ఇదిలావుండగా.. కటక్ జిల్లాలోని అథాగఢ్ అటవీ రేంజ్, హరిదాపసి అడవుల్లో చిరుత కళేబరాన్ని గుర్తించారు అధికారులు. చిరుత చంపి, కోరలను తీసుకెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు నిర్దారించారు. ఈ కేసులో ఇద్దరు అటవీశాఖ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇప్పటికే నందన్ కానన్ జూపార్కులో ఏనుగులు వరుసగా మృత్యువాత పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు అధికారులు. అదే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు చిరుతను వేటాడినట్లు స్పష్టం కావడంతో.. అటవీ శాఖను ప్రక్షాళన చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.