అయ్యప్ప స్వాములకు మరో షాక్.. ఈసారి రైల్వేశాఖ వంతు
హైదరాబాద్ : అయ్యప్ప భక్తులకు మరో షాక్ తగిలింది. ఇటీవల 50 ఏళ్లలోపు మహిళలు స్వామివారి దర్శనం చేసుకోవచ్చనే సుప్రీంకోర్టు తీర్పుపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. శబరిమలలో మహిళలకు ప్రవేశం లేదు. ఆ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇటీవల కొన్నిసార్లు మహిళలు స్వామివారి దర్శనానికి ప్రయత్నించిన సందర్భాల్లో అయ్యప్ప భక్తులు భగ్గుమన్నారు.
అదలావుంటే తాజాగా రైల్వేశాఖ మరో షాక్ ఇచ్చింది. శబరిమలకు వెళ్లే సమయంలో రైలులో ప్రయాణించే భక్తులు దీపం, హారతి కర్పూరం వెలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు సాధారణంగా రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి శబరిమల వెళ్లడానికి రైలు సౌకర్యముంది. అయితే వివిధ ప్రదేశాల నుంచి అక్కడకు చేరుకోవాలంటే దాదాపు 2-3 రోజుల సమయం పడుతుంది. దీంతో రైలులోనే పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తుంటారు భక్తులు. ఈమేరకు బోగీలలో పూజలు చేస్తూ కర్పూరం వెలిగిస్తుంటారు. అయితే అయ్యప్ప భక్తులు రైలు ప్రయాణాల్లో ఇలా చేస్తున్నారని రైల్వేశాఖకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. దీంతో రైళ్లల్లో నిప్పు వెలిగించడం నిషేధమని ప్రకటించింది రైల్వేశాఖ. ఎవరైనా అలా పట్టుబడితే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే ఛాన్సుందని తెలిపింది.