ప్రపంచం నెత్తిన మరో ‘స్కైలాబ్’!? ఇది మనం ప్రయోగించిందే, 40 రోజులే గడువు, తీవ్ర ఉత్కంఠ!
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం.. అమెరికా తొలి మానవ సహిత అంతరిక్ష కేంద్రం ‘స్కైలాబ్’ రోదసి నుంచి కూలి సృష్టించిన సంచలనం గుర్తుందా? ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురుకాబోతోంది.
Recommended Video
న్యూఢిల్లీ: దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం.. అమెరికా తొలి మానవ సహిత అంతరిక్ష కేంద్రం 'స్కైలాబ్' రోదసి నుంచి కూలి సృష్టించిన సంచలనం గుర్తుందా? ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురుకాబోతోంది.
గత నెల 31న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్ ఉపగ్రహం మరో స్కైలాబ్ కాబోతోంది. ఇస్రో ప్రయోగం విఫలం కావడంతో దాదాపు టన్నున్నర బరువుండే ఈ ఉపగ్రహం రోదసిలో కొట్టుమిట్టాడుతోంది.
ఈ ఉపగ్రహం మరో 40 రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని.. ఆ సమయంలో అది పేలిపోతే దాని శకలాలు తీవ్రనష్టాన్ని కలగజేసే అవకాశముందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఇస్రో మాత్రం అలాంటి ప్రమాదమేదీ లేదని కొట్టిపారేస్తోంది.
అసలేం జరిగిందంటే...
దేశీయ నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకునే క్రమంలో భాగంగా.. ఆగస్టు 31న ఇస్రో ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అయితే ఈ ఉపగ్రహపు రాకెట్ హీట్షీల్డ్లో లోపం ఉండటంతో అది తెరుచుకోలేదు. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించలేదు. రాకెట్ హీట్షీల్డ్లో ఉండిపోయింది. ఫలితం... ప్రయోగం విఫలమయింది.
శరవేగంగా భూమి వైపు...
ఇప్పుడు హీట్షీల్డ్తో కలిపి ఈ ఉపగ్రహం భూవాతావరణం వైపు వేగంగా తిరిగి వస్తోంది. ఇది మరో నలభై, యాభై రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఆ ఉపగ్రహం పేలిపోతే- ఆ గ్రహశకలాలు ఎక్కడ పడతాయనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా ఉపగ్రహాలు మనకు ఎంత దూరంలో ఉన్నాయనే విషయాన్ని పెరిజి (భూమికి సమీపంలో ఉన్నప్పుడు).. అపోజి (భూమికి దూరంగా ఉన్నప్పడు)లలో కొలుస్తారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహం పెరిజి 164 కిలోమీటర్లు ఉంటే.. అపోజి 6,500 కిలోమీటర్లు ఉంది.
ఇంధనం మండించే ప్రయత్నాలు...
‘‘రాకెట్ నాలుగో దశ భాగం.. ఉపగ్రహం.. హీట్షీల్డ్- ఈ మూడింటి బరువు 2.4 టన్నులు. ప్రస్తుతం ఈ ఉపగ్రహం నుంచి మా ట్రాకింగ్ స్టేషన్లకు సంకేతాలు అందుతున్నాయి. ఈ ఉపగ్రహంలో 750 కేజీల ఇంధనం ఉంది. దానికి సంకేతాలు పంపి మండించటానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ఎప్పుడు భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం..'' అని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరక్టర్ కె. శివన్ పేర్కొన్నారు.
భూ వాతావరణంలోకి ప్రవేశిస్తే నియంత్రణ కష్టమే..
అయితే భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఉపగ్రహం ట్రాకింగ్ స్టేషన్ల ఆధీనంలో ఉండదంటున్నారు ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్ పి.పూర్ణచంద్రరావు. ‘‘ఒక రాకెట్ను సెకనుకు కిలోమీటరు వేగంతో పైకి పంపుతారు. కానీ అది రోదసి నుంచి భూవాతావరణంలోకి ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. భూవాతావరణం సమీపంలోకి వచ్చేటప్పటికి భూమ్యాకర్షణ శక్తి దానిపై పనిచేసి.. దానిని తనవైపు లాక్కుంటుంది. ఆ శకలాలు ఎక్కడపతాయనేదే పెద్ద ప్రశ్న'' అని పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
శకలాలు ఎక్కడ పడతాయో?
అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించే శకలాల వేగాన్ని కనిపెట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా దగ్గర టూ ఎలిమెంట్ సిస్టమ్ అనే వ్యవస్థ, ఇస్రో వద్ద మల్టీ అబ్జెక్ట్ ట్రాకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. టూ ఎలిమెంట్ సిస్టమ్ అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలపైన, శకలాలపైన ఒక కన్నేసి ఉంచుతుంది. వీటి ద్వారా శకలాలు భూవాతావరణానికి సమీపంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది.
ఆ 36 గంటలే కీలకం..
అయితే ఆ శకలాలు ఎక్కడ పడతాయనే విషయం 36 గంటల ముందు మాత్రమే కనుగొనగలుగుతారు. ‘‘మా ట్రాకింగ్ స్టేషన్ల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా చూస్తే ఆ శకలాలు సముద్రంలో పడతాయని భావిస్తున్నాం. అయితే కచ్చితమైన సమాచారం మాత్రం 36 గంటల ముందు మాత్రమే తెలుస్తుంది. ఈ ఉపగ్రహం మరో స్కైలాబ్ అయ్యే అవకాశం లేదు'' అంటున్నారు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరక్టర్ కె. శివన్.
1979లో.. ‘స్కైలాబ్’ భయం!
స్కైలాబ్.. ఇప్పటి తరం వారికి ఆ పేరు గురించి తెలీదుగానీ, 40-50 ఏళ్లు దాటిన వారికి ఆ సంచలనం గురించి బాగాతెలుసు! అమెరికా ప్రయోగించిన ఆ తొలి మానవ సహిత అంతరిక్ష కేంద్రం 1979 జూలై 11న కూలిపోయింది! అది కూలడానికి కొద్దిరోజుల ముందు ‘స్కైలాబ్ మీద పడుతుందట.. మనుషులంతా చచ్చిపోతారట..' అనే వదంతులు జోరుగా షికారు చేయడంతో అరాచకం ప్రబలింది.
ఆస్తులమ్మి ఎంజాయ్ చేశారు...
బతికున్న కాసిని రోజులైనా ఎంజాయ్ చేసి చచ్చిపోదామనుకున్న వారు కొందరు.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆర్థికంగా లాభపడినవారు మరికొందరు.. చేతిలో ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు చేసిన వారు ఇంకొందరు.. అమెరికాలో చాలా మంది ‘స్కైలాబ్' పేరుతో వస్తువులు అమ్మి వ్యాపారం కూడా చేశారు.
శకలాన్ని తెచ్చిచ్చిన వారికి బహుమతి...
శాన్ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్ అనే కంపెనీ.. తొలి స్కైలాబ్ శకలాన్ని తెచ్చిచ్చిన వాళ్లకి 10 వేల డాలర్ల నగదు బహుమతి ప్రకటించింది. క్రానికల్ సంస్థ.. స్కైలాబ్ వల్ల నష్టపోయిన వారికి 2 లక్షల డాలర్లు ఇస్తామంది. కానీ, వాస్తవంలో స్కైలాబ్ వల్ల పెనుప్రమాదమేదీ సంభవించలేదు. అది ఆస్ట్రేలియాకు సమీపంలో సముద్రంలో కూలిపోయింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎస్పరెన్స్లో ఓ వ్యక్తి ఇంట్లో 24 శకలాలు పడ్డాయి. ఫిలడెల్ఫియా వ్యాపారవేత్త ఒకరు ఆ ఆస్ట్రేలియన్ను, అతడి కుటుంబాన్ని అమెరికాకు తీసుకెళ్లి 10 వేల డాలర్ల నగదు బహుమతి ఇప్పించాడు.