జమిలి ఖాయం.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలా.. పిక్చర్ క్లియర్..!!
దేశంలో మోడీ సర్కార్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇటు రాజకీయంగా అటు పాలనా పరంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి రెండో సారి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జమిలి కాన్సెప్ట్ తెరపైకొచ్చింది. అంతేకాదు దీనిపై కేంద్రం కూడా వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తోంది. తాజాగా జమిలి ఎన్నికలపై చర్చ జరిగింది. ఇందుకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి.
Recommended Video
జమిలి ఎన్నికలపై కేంద్రం క్లియర్
మరో రెండు నెలల్లో భారత్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీతో పాటు ఇతర ప్రధాన పార్టీలు రంగంలోకి దిగి తమ వ్యూహాలకు పదను పెడుతున్నాయి. ఎలాగైనా సరే ఆ రాష్ట్రాలను చేజిక్కించుకోవాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతుండగా... ఆ రాష్ట్రాల్లో తిరిగి అధికారం పొందేందుకు ప్రస్తుత ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇక తాజాగా జమిలి ఎన్నికల కాన్సెప్ట్ మరోసారి తెరపైకొచ్చింది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ప్రధాని మోడీ కూడా కొద్ది రోజుల క్రితం ఒక దేశం - ఒక ఎన్నికపై మాట్లాడారు. జమిలి ఎన్నికలు ఈ తరుణంలో ఎంతో అవసరమని అన్నారు. జమిలి ఎన్నికలతో సమయం వృథా కాదని అదేసమయంలో ఖర్చు కూడా తక్కువే అవుతుందని ప్రధాని చెప్పారు. దేశంలో నిత్యం ఎన్నికలు జరుగుతుండటం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు దేశంలో జమిలి కాన్సెప్ట్..
1952,1957,1962,1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. అంటూ ఇటు పార్లమెంటుకు అటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1959లో తొలిసారిగా ఈ ప్రక్రియకు కేరళలో బ్రేక్ పడింది.1957లో ప్రజాస్వామ్య పద్ధతిన ఏర్పడ్డ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను ఆయుధంగా చేసుకుని రద్దు చేయడంతో కేరళలో రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆ తర్వాత 1960లో తిరిగి కేరళలో ఎన్నికలు జరిగాయి. తిరిగి 1967లో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఇబ్బందులు తలెత్తడంతో ఒక దేశం ఒక ఎన్నిక విధానంకు బ్రేక్ పడింది.ఇలా కొన్ని కారణాలతో ఆయా రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు వేర్వేరుగా జరిగాయి. నాడు లా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరిగి జమిలి ఎన్నికలకు వెళ్లాలని 1983లో అడుగులు ముందుకు పడినప్పటికీ సక్సెస్ కాలేదు. 2003 అప్పటి ప్రధాని వాజ్పేయి సోనియాగాంధీతో చర్చలు జరిపారు. అంతేకాదు 2010లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో చర్చలు జరిపారు.
జమిలితో లాభాలేంటి..?
ఇక తాజాగా ఎన్నికల సంఘం కూడా జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 2009లో సాధారణ ఎన్నికలకు రూ.1115 కోట్లు ఖర్చు కాగా 2014 ఎన్నికలకు అది రూ.3,870 కోట్లకు చేరుకుందని నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇక 2020 జూన్లో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా జమిలి ఎన్నికల ప్రాముఖ్యతను గూర్చి వివరించారు. ఇక ప్రస్తుతం జమిలి ఎన్నికలపై ఒపీనియన్ తీసుకునేందుకు రెండు దఫాలుగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మొత్తం 22 రాజకీయ పార్టీలు జమిలికి జై కొట్టాయి. దీంతో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరినాటికి జమిలి ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
టీడీపీ సపోర్ట్ చేస్తుందా..లేదా
ఇక తెలుగు రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మోడీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జమిలికి అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఆ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందలేదు. ఒకవేళ జమిలి కాన్సెప్ట్పై ఇప్పుడు చర్చించినా.. టీడీపీ తప్పకుండా అంగీకారం తెలుపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చంద్రబాబు కూడా త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయని అందుకు సిద్ధంగా ఉండాలని జగన్ అధికారం కోల్పోతారని పదేపదే పార్టీ సమావేశాల్లో చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే టీడీపీ కూడా జమిలి ఎన్నికలకు ఫేవర్గానే ఉందని చెప్పొచ్చు. ఇక ఎటొచ్చి ఎంఐఎం పరిస్థితి పై క్లారిటీ రావాల్సి ఉంది.
మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జమిలి ఎన్నికలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్రం కూడా వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తోంది.