అర్థం లేని చర్యలు... కనీసం ఆకలి తీర్చలేని వైఫల్యం.. మోదీ సర్కార్ డొల్లతనం బట్టబయలు..
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా పేద,దిగువ మధ్య తరగతికి చెందిన లక్షలాది కుటుంబాలు ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్నాయి. ఉన్నచోట ఉపాధి కోల్పోయి చాలా కుటుంబాలు నగరాల నుంచి స్వస్థలాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ కింద గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడగించింది. అలాగే 7 రాష్ట్రాల్లో రోజ్గారీ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకాలేవీ వలస కార్మికుల కష్టాలను తీర్చలేవని ప్రముఖ జాతీయ పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఆ కథనాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
తెలంగాణలో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం: ఏపీలో ఎదురుచూపులు, కరోనా కేసులు ఇలా
గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం..
ప్రధాని నరేంద్ర మోదీ గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడగించారు. దీని ద్వారా 80 కోట్ల మంది భారతీయులు లబ్ది పొందనున్నారు. ప్రస్తుతం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) వద్ద 100 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ధాన్యాలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేదలకు ఆర్నెళ్ల పాటు ఇచ్చే ఉచిత రేషన్ను రెట్టింపు చేయాలని కేంద్రాన్ని కోరారు. కానీ కేవలం రేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే రెట్టింపు రేషన్ ఇవ్వడం ద్వారా కొద్ది మంది ఆకలి మాత్రమే తీర్చగలరు.
ఎన్ఎఫ్ఎస్ఏ అప్డేట్..?
2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్(NFSA) అమలులోకి తీసుకొచ్చినప్పుడు సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలు మూడింట రెండొంతుల మంది భారతీయులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పైగా అప్పటినుంచి రేషన్ కార్డుల జాబితా నుంచి తొలగించబడ్డవారి సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం దాదాపు 100 మిలియన్ల పేర్లు ఎన్ఎఫ్ఎస్ఏలో అప్డేట్ చేయబడలేదు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడూ లోపాలతోనే సాగుతూ వచ్చింది. ఇక రేషన్ కార్డుకు ఆధార్తో అనుసంధానం చేయాలన్న నిబంధన ఎంతోమంది అసలైన లబ్దిదారులను జాబితాకు దూరం చేసింది.
ఆకలి చావులు.. కొన్ని రాష్ట్రాల్లో ఉదార చర్యలు..
ఫలితంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్(NFSA) అమలులో ఉన్నప్పటికీ... దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో ఎంతోమంది దళితులు,ఆదివాసీలు,ముస్లింలు ఆకలి చావులు వెలుగుచూశాయి. ఈ ఏడాది మార్చిలో లాక్ డౌన్ తర్వాత 200 మంది ఆకలి చావులకు గురయ్యారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ వంటి కొద్ది రాష్ట్రాలు మాత్రమే తమ సొంత డబ్బులతో పీడీఎస్(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్)ను విస్తృతం చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో అడుగు ముందుకేసి జూన్-2021 వరకు ఉచిత రేషన్ను పొడగించారు.
ఎన్ఎఫ్ఎస్ఏ జాబితాలో లేని వారి సంగతేంటి...
కొద్ది రాష్ట్రాలు ఇలా పేదల పట్ల ఉదారంగా వ్యవహరించడం వారికి కాస్త రిలీఫ్ అనే చెప్పాలి. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కూడా దీనికి తోడవడంతో పేదలకు రెట్టింపు రేషన్ అందుతోంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఒక్కొక్కరికి ఇచ్చే 5 కిలోల బియ్యానికి,కేంద్రం ఇచ్చే మరో 5 కిలోలను కలిపి 10కిలోలు పంపిణీ చేస్తున్నారు. అయితే ఎన్ఎఫ్ఎస్ఏ జాబితాలో లేని వ్యక్తులు లేదా కుటుంబాలకు ఈ లబ్ది చేకూరట్లేదు. దానికి తోడు వలస కార్మికులకు ప్రభుత్వం రేషన్ అందిస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలే చొరవ తీసుకుని వలస కార్మికులకు కూడా ఉచిత రేషన్ అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది మిగతా రాష్ట్రాల్లో కనిపించట్లేదు.
వలస కార్మికులను మళ్లీ గాలికొదిలేశారా..?
లాక్ డౌన్ పీరియడ్లో దాదాపు 2 నెలల పాటు వలస కార్మికులు,కూలీల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఆ తర్వాత 8కోట్ల మంది వలస కార్మికులకు ఉచిత రేషన్ ప్రకటించింది. కానీ ఆ తర్వాత మళ్లీ వాళ్లను పట్టించుకోలేదు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ అన్న యోజన పథకాన్ని పొడగిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంలోనూ... వలస కార్మికులకు ఇది వర్తిస్తుందా లేదా అన్న స్పష్టత ఇవ్వలేదు. అయితే అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే ఇస్తున్న ఆహార ధాన్యాల కోటాకు మరో 10 శాతం అదనంగా ఇస్తున్నారు. అయితే ఏ రాష్ట్రంలో ఎంతమంది వలస కార్మికులు ఉన్నారు... ఎంతమంది వలస కార్మికులు వెళ్లిపోయారు... వంటి డేటా ఏదీ లేకుండా గుడ్డిగా చేపట్టే చర్యలతో ఉపయోగం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వన్ నేషన్ వన్ రేషన్.. ఇలాగేనా...?
ఒకరకంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితుల్లో వన్ నేషన్ వన్ రేషన్ అనే నినాదం కూడా అర్థం లేనిదే. పైగా రేషన్ కార్డు పోర్టబిలిటీ ఆధార్తో లింక్ అవడం ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తుంది. ప్రస్తుతం కేరళ,కర్ణాటక,జార్ఖండ్,గోవా,హర్యానా వంటి రాష్ట్రాలు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రేషన్ బయోమెట్రిక్ను నిలిపివేశాయి. అలాంటప్పుడు కొత్తగా రేషన్ కార్డును మరోచోటుకు మార్చుకున్నవారికి బయోమెట్రిక్ నమోదు చేసే అవకాశం ఎక్కడుంటుంది. ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ అంటూ భారీ ప్రచారం చేసినప్పటికీ... జూలై 1 నాటికి దేశంలో కేవలం 490 రేషన్ కార్డుల వినియోగదారులు మాత్రమే పోర్టబిలిటీని ఉపయోగించుకుని వేరే రాష్ట్రాలకు మార్చుకున్నారు.
ఆ చర్యలు మాత్రమే సంక్షోభం నుంచి బయటపడేయగలవు..
లాక్ డౌన్ పీరియడ్లో 3 నెలల పాటు జన్ధన్ ఖాతా కలిగిన 200 మిలియన్ల మంది మహిళల ఖాతాల్లో రూ.500 జమ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని పొడగించలేదు. ఇక నరేగా కోసం మరో రూ.40వేల కోట్లు కేటాయించినప్పటికీ... ఆ నిధులు కూడా ఏ మూలకు సరిపోయేలా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకానికి డిమాండ్ పెరగడంతో తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే దానికి కేటాయించిన సగం బడ్జెట్ అయిపోయింది. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏడాదికి 200 రోజుల పాటు ఉపాధి కల్పన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే అన్స్కిల్డ్ అగ్రికల్చర్ వర్కర్స్ వేతనాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. పీడీఎస్ను మరింత విస్తృతం చేయడం,పెన్షన్లను పెంచడం,నగదు బదిలీని చేపట్టం,ఉపాధి హామీ పథకాలు వంటి చర్యలు మాత్రమే ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతాయి.