'వన్ నేషన్-వన్ రేషన్' కార్డుతో వలసలకు ఆహార భద్రత- సుప్రీంకు తెలిపిన కేంద్రం
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల ఆహారభద్రతకు తాము అమలు చేస్తున్న వన్ నేషన్ వన్ రేషన్ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారులైన వారందరికీ దీని వల్ల ఎంతో లబ్ది కలుగుతుందని వెల్లడించింది.
కరోనా సమయంలో వలస కార్మికుల ఆహార భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు తెలపాలని కేంద్రాన్ని అంతకుముందు సుప్రీంకోర్టు కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం... జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 69 కోట్ల మంది లబ్దిదారులకు దీని వల్ల లబ్ది చేకూరుతుందని కేంద్రం తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్ధలోని సాంకేతిక పరిజ్ఞానంలో తాము చేసిన మార్పుల వల్ల రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికులు సైతం సరుకులు తీసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు.
దేశంలో ఇంకా అస్సాం, ఛత్తీస్ఘడ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం అమలు కావాల్సిఉందన్నారు. ఇందుకోసం ఆయా ప్రభుత్వాల సహకారం కోరుతున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తాజాగా సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్లో వన్ నేషన్ వన్ రేషన్ పథకం అమలు చేయకపోవడం పట్ల అక్కడి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా విచారణ సందర్భంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది.