ఒక దేశం ఒక రేషన్ కార్డు: త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేయనున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ:నరేంద్ర మోడీ సర్కార్ రెండో సారి అధికారం చేపట్టాక పాలనాపరమైన మార్పులను శరవేగంగా తీసుకొస్తోంది. ఇప్పటికే ఒక దేశం ఒకే ఎన్నికపై విధివిధానాలు రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒకే దేశం ఒకే రేషన్ కార్డును ప్రకటించింది. ఇది తర్వలో అమలు కాబోతోందంటూ కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. ఈ తరహా కార్డుతో దేశంలో ఏ రేషన్ దుకాణం నుంచైనా సరే లబ్ధిదారులు రేషన్ పొందొచ్చని ఆయన చెప్పారు.
ఆహార భద్రతపై రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్షా జరిపారు కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్. ఈ సమావేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్, రాష్ట్ర వేర్హౌసింగ్ కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఆహార భద్రత చట్టం అమలు కోసం అధికారులతో చర్చించారు. ప్రతి రేషన్ దుకాణం కంప్యూటరీకరణ, ఆహార ధాన్యాలు పారదర్శకంగా పంచడం, ఎఫ్సీఐ, సీడబ్ల్యూసీ, ఎస్డబ్ల్యూసీ డిపోలను బలోపేతం చేయడంపై మంత్రి చర్చించారు. ఒకదేశం ఒక రేషన్ కార్డు ద్వారా లబ్దిదారుడు మరో ప్రాంతానికి వలసపోతే అక్కడ ఇబ్బందులు పడకుండా ఈ కార్డు ద్వారా వారికి రేషన్ అందుతుందని రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ఇలా ఉండకపోతే అవినీతికి అవకాశం ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు.
ఇప్పటికే ఈ తరహా విధానం ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, త్రిపురా రాష్ట్రాల్లో ఏ జిల్లాలో అయినా సరే లబ్దిదారుడు కార్డు చూపిస్తే వారికి రేషన్ ఇస్తున్నామని చెప్పారు.ఇక ఈ తరహా పద్ధతిని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని అది త్వరలోనే జరుగుతుందని రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ఇది అనుకున్న సమయానికే పూర్తవుతుందని హామీ ఇచ్చారు. ఆహారం మరియు ప్రజాపంపిణీ వ్యవస్థలు చాలా ముఖ్యమైనవని రాంవిలాస్ పాశ్వాన్ అన్నారు. ఏటా గోడౌన్లలో నిల్వ ఉంచిన 612 లక్షల టన్నుల ధాన్యంను 81 కోట్ల మంది ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.