'దటీజ్ నరేంద్ర మోడీ! ఓ సోదరుడు ఆటో డ్రైవర్, మరో సోదరుడిది కిరాణా షాప్'
అగర్తాలా: ప్రపంచంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదిరిగా ఎవరూ ఉండబోరని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ సోమవారం అన్నారు. ప్రధాని మోడీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎంతో నిరాడంబరంగా ఉంటారని ప్రశంసలు కురిపించారు.
అగర్తాలలో నిర్వహించిన పరాక్రమ్ పర్వ్ కార్యక్రమంలో బిప్లవ్ దేబ్ మాట్లాడారు. ప్రధానిగా ఉండి కూడా మోడీ నిరాడంబరత అద్భుతమని చెప్పారు. ప్రధానికి తల్లి ఉన్నారని, కానీ ఆమె ఆయనతో పాటు అధికారిక నివాసంలో ఉండటం లేదని చెప్పారు. మోడీ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారని, 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారని చెప్పారు.
తమిళనాడులో 'ఠాగూర్' సీన్ రిపీట్: మృతదేహానికి మూడ్రోజులు వైద్యం
కానీ నరేంద్ర మోడీ సోదరుల్లో ఒకరు కిరాణా దుకాణం నడుపుకుంటారని, మరొకరు ఆటో డ్రైవర్గా ఉన్నారని బిప్లవ్ దేబ్ అన్నారు. మోడీ తల్లిగారు ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారని చెప్పారు. ప్రపంచంలోనే ఇలాంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారా చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ చాయ్ అమ్మి తన జీవితాన్ని ప్రారంభించారు. గుజరాత్ సీఎంగా, ప్రధానిగా ఎదిగారు. ఆయన ఇటీవల తన ఆస్తులను ప్రకటించారు. వీటి ప్రకారం మార్చి 31, 2018 నాటికి ఆయన చేతిలో ఉన్న నగదు రూ.48,944 మాత్రమే. ఆయన ఆస్తుల విలువ రూ.2.28 కోట్లు మాత్రమే. ఇందులో రూ.1.28 కోట్లు చరాస్తులు కాగా, గాంధీ నగర్లోని మోడీ నివాస స్థలం విలువ రూ.ఒక కోటి. ఆయనకు సొంత కారు లేదు.