స్పాట్.. తుపాకుల మోతతో దద్దరిల్లిన ఎంఎంసీ జోన్.. నలుగురు మావోలు,ఒక ఎస్ఐ మృతి..
ఛత్తీస్ఘడ్ అడవులు మరోసారి బుల్లెట్లతో దద్దరిలయ్యాయి. రాజ్నందగావ్ జిల్లాలోని మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి, పర్దోని గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 10.30గం. సమయంలో పోలీసులు,మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఎస్ఐతో పాటు నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు.
నలుగురు మావోలు హతం
మావోయిస్ట్ ఏరివేత ఆపరేషన్లో భాగంగా పోలీసులు ఆ అటవీ ప్రాంతానికి వెళ్లారు. మావోల కదలికలపై తమకు పక్కా సమాచారం అందడంతోనే అక్కడికి వెళ్లినట్టు ఎస్పీ జితేంద్ర శుక్లా తెలిపారు. ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న సమయంలోనే మావోలు తమపై కాల్పులకు దిగారని.. దీంతో తాము కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. కాల్పుల్లో మావోయిస్ట్ డివిజనల్ కమిటీ సభ్యుడు అశోక్,సీపీఐ మావోయిస్ట్ ఏరియా కమిటీ మెంబర్ కృష్ణ,సరితా,ప్రమీలా అనే ఇద్దరూ జూనియర్ మావోయిస్టులు హతమైనట్టు వెల్లడించారు.
ఎస్ఐ మృతి.. రైఫిల్స్ స్వాధీనం
అదే సమయంలో ఎస్ఐ ఎస్కే శర్మ మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందినట్టు తెలిపారు. శర్మ సుర్గుజా జిల్లాలోని మదన్వాడ పోలీస్ స్టేషన్ ఇన్చార్జిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి ఏకె-47 రైఫిల్స్,ఒక ఎస్ఎల్ఆర్,రెండు 315 బోర్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామన్నారు.
Recommended Video
ఎంఎంసీ జోన్లో పట్టు బిగించేందుకు..
మావోయిస్టులు రాజ్నందగావ్ను కొత్తగా తమ రెడ్ కారిడర్లో చేర్చుకున్నారు. మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,ఛత్తీస్ఘడ్లకు ఇది ట్రై-జంక్షన్లా ఉంటుంది. దీన్నే ఎంఎంసీ(మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,ఛత్తీస్ఘడ్) జోన్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో మావోలు తమ పట్టు బిగించేందుకు కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఎంఎంసీ జోన్లోని విస్తార్ దళంలో దాదాపు 180 మంది సాయుధ మావోయిస్టులు ఉంటారని భావిస్తున్నామన్నారు.