న్యాయానికి అడుగుదూరంలో: నిర్భయ తల్లి.. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు...
నిర్భయపై దారుణంగా లైంగికదాడి జరిపి, హతమార్చేందుకు కారణమైన దోషులకు శిక్ష పడేందుకు మార్గం సుగమమైంది. దోషుల్లో ఒక్కరైన అక్షయ్ కుమార్ సింగ్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తిరస్కరించింది. దీంతో నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. దోషులకు త్వరలో ఉరి శిక్ష పడి, తమ కూతురు నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరస్కరణ..
ఉరిశిక్షను సమీక్షించాలని దోషి అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా బుధవారం సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో దోషులకు ఉరి శిక్ష పడటం ఖాయమని ఆశాదేవి తెలిపారు. నిందితుల ఉరిశిక్ష అమలు అడుగుదూరంలో ఉందని ఆమె చెప్పారు. దోషులకు ఉరి శిక్ష విధించాలని తాము గత ఏడేళ్ల నుంచి పోరాడుతున్నామని చెప్పారు. తమకు న్యాయం జరగాలని చూస్తున్నామని తెలిపారు. కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని.. అయినా తమ పోరాటం మాత్రం ఆగబోదని చెప్పారు.

నిర్భయ జ్యోతి ట్రస్ట్
తమ కూతురు పేరుతో ఏర్పాటుచేసిన నిర్భయ జ్యోతి ట్రస్ట్ ద్వారా దోషులకు శిక్ష విధించాలని పోరాడుతున్నామని చెప్పారు. నిర్భయ ఘటన తర్వాత దేశంలో ఉన్నస్త్రీలపై హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా నిర్భయ జ్యోతి ట్రస్ట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ దేశంలో మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. మహిళలకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంటినుంచి బయటకెళ్లిన మహిళ సురక్షితంగా ఇంటికి తిరిగిరావాలని ఆశాదేవి కోరుకున్నారు.

ఉరే సరి
తామే కాదు ప్రజలు కూడా నిర్భయ దోషులకు ఉరి తీయాలని కోరుకుంటున్నారని ఆశాదేవి పేర్కొన్నారు. ఏడేళ్లు గడుస్తోన్న దోషులకు శిక్ష పడకపోవడం మాత్రం కలచివేస్తోందని తెలిపారు. మనోధైర్యం కోల్పోకుండా.. ఎప్పుడూ దోషులకు ఉరి తీస్తారోనని ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇందుకు తమకు చాలామంది మద్దతు తెలుపుతున్నారని నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ పేర్కొన్నారు.

కాళరాత్రి..
2012లో డిసెంబర్ 16వ తేదీని స్నేహితుడితో కలిసి వస్తోన్న యువతిని ఆరుగురు లైంగికదాడి చేసి.. బస్సుల్లోంచి పడేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. నిర్భయ దోషులను ఉరితీయాలని యావత్ భారతం నినాదిస్తోంది. ట్రయల్ కోర్టు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించింది. దానిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. నిర్భయ దోషులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఆయన తిరస్కరించడంతో.. కేంద్ర హోంశాఖ వద్దకు ఫైలు చేరింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరిస్తే వారికి ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది.

వీరే దోషులు
నిర్భయ కేసులో మొత్తం ఆరుగురు దోషులు. రామ్ సింగ్ అనే దోషి తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో మైనర్ బాలుడు, మూడేళ్ల శిక్ష తర్వాత బెయిల్పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ముఖేశ్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ సింగ్ సహా మరొకరు ఉన్నారు. కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించింది. అక్షయ్ కుమార్ సింగ్ వేసిన క్షమాభిక్ష పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో త్వరలో నిర్భయ నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications