నౌగామ్లో మరో ఉగ్రవాది హతం: ఆధారాలతో బయటపడిన పాక్ పన్నాగం
న్యూఢిల్లీ: పాక్ నుంచి భారత్ వైపు ఉగ్రవాదుల చొరబాటు ఆగడం లేదు. హంద్వారా అనంతరం నౌగామ్ సెక్టారులో ఓ ఉగ్రవాదిని ఆర్మీ ఎన్కౌంటర్ చేసింది. కుప్వారా జిల్లాలోని హంద్వారా వద్ద గల నౌగామ్ సెక్టారులో ఓ ఉగ్రవాది చొరబాటుకు ప్రయత్నించగా కాల్చి చంపారు.
కాగా, హంద్వారాలో పాకిస్థాన్ పాపం మరోసారి బయటపడింది. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే ఉగ్రమూకను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కుట్రకు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. హంద్వారాలో లాంగేట్ వద్ద సరిహద్దు ఫెన్సింగ్ దాటి ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ సైనిక శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. హోరా హోరీ పోరులో ఎట్టకేలకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల అనంతరం ఘటనాస్థలంలో 3 ఏకే 47లు, లాంచర్లు, ఫుడ్ ప్యాకెట్లు, ఇంజక్షన్లు, మ్యాప్లు, జీపీఎస్ పరికరాలు, రేడియో సెట్లు, మ్యాట్రిక్ షీట్స్ స్వాధీనం చేసుకున్నారు.
హంద్వారా ఆపరేషన్ ముగిసిన అనంతరం సైనిక అధికారులు మీడియాతో మాట్లాడారు. ముగ్గురు ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయన్నారు. వారి వద్ద లభ్యమైన పరికరాలు ఓబీఎస్ పాకిస్థాన్ ప్రై.లిమిటెడ్ సంస్థ తయారు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. ఇంజక్షన్లు కూడా పాకిస్థాన్లోనే తయారైనట్లు గుర్తించామన్నారు. ముగ్గురు ముష్కరులు హతమవడంతో హంద్వారా ఆపరేషన్ ముగిసిందన్నారు. జవాన్లు అప్రమత్తంగా ఉండి ముష్కరులను దీటుగా ఎదుర్కొన్నారని అభినందించారు.