బళ్లారి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మాయం, కర్ణాటక అసెంబ్లీలో ఏం జరుగుతోంది: సీఎం !
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, మస్కి ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ మాయం కావడంతో వారు ఎక్కడ ఉన్నారు అని ఆ పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. అయితే బీజేపీకి చెందిన ప్రముఖ బళ్లారి ఎమ్మెల్యే మాయం కావడం తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. అసలు ఏం జరుగుతుంది అనే విషయం అర్థం కావడం లేదని కన్నడిగులు అంటున్నారు.
చక్రం తిప్పారు
కర్ణాటక రాజకీయాల్లో 2008 నుంచి కొన్ని ఏళ్లు గాలి జనార్దన్ రెడ్డి సోదరులు చక్రం తిప్పారు. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు గాలి కరుణాకర రెడ్డి. వీరి ప్రధాన అనుచరుడు బళ్లారి బి. శ్రీరాములు మంత్రులుగా పని చేశారు. గాలి జనార్దన్ రెడ్డి మరో సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి 2008లో బళ్లారి ఎమ్మెల్యే అయ్యారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే
2018 శాసన సభ ఎన్నికల్లో బళ్లారి సిటీ నుంచి బీజేపీ టిక్కెట్ పై పోటీ చేసిన గాలి సోమశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే శనివారం విధాన సౌధలో గాలి సోమశేఖర్ రెడ్డి కనపడకపోవడంతో బీజేపీ నాయకులు ఆందోళనకు గురైనారు.
మొత్తం ముగ్గురు మాయం
గాలి సోమశేఖర్ రెడ్డి మద్యాహ్నాం 1.45 గంటలు అయినా కనపడకపోవడంతో బీజేపీ నాయకుల్లో తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, మస్కి ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ కనపడకపోవడంతో వారి కోసం ఆ పార్టీ నాయకులు గాలిస్తున్నారు.
గాలి కోసం ఎదురుచూపులు
గాలి సోమశేఖర్ రెడ్డి రెండు రోజుల క్రితమే బళ్లారి నుంచి బెంగళూరు వచ్చారని తెలిసింది. అయితే విదాన సౌధకు వెళ్లి ఎందుకు ప్రమాణ స్వీకారం చెయ్యలేదు ? ఆయన ఎక్కడ ఉన్నారు ? అని బీజేపీ నాయకులు ఆరా తీస్తున్నారు. సాయంత్రం 4 గంటల లోపు గాలి సోమశేఖర్ రెడ్డి విదాన సౌధకు వచ్చి ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ నాయకులు ఎదురు చూస్తున్నారు.