అయ్యో పాపం: మేకును మింగిన ఏడాది బాలుడు.. ఊపిరాడక మృతి
ఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఒక ఏడాది వయసున్న చిన్నారి ప్రమాదవశాత్తు ఓ ఇనుప మేకును మింగడంతో అది కాస్త గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో చాలా సేపు ఇబ్బంది పడ్డాడు. రోధించాడు. చివరికి ప్రాణాలు వదిలాడు. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. బుధవారం అర్థరాత్రి రోజున ఈ ఘటన జరిగింది. చిన్నారి రోధిస్తుండటంతో తల్లిదండ్రులు సమీపంలోని సుశృతా ట్రామా సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చిన్నారి మేకు మింగినట్లు ధృవీకరించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు
చిన్నారికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత డాక్టర్లు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆహారం నాళంలో మేకు ఇరుక్కుపోయిందని దీంతో ఊపిరాడక చిన్నారి మృతి చెందాడని వైద్యులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారిని రెహాన్గా గుర్తించారు. వజీరాబాద్లోని ఓ అద్దె ఇంట్లో వీరు నివాసముంటున్నారు. బీహార్లోని భగల్పూర్ జిల్లా వీరి సొంత ఊరు. ఇదిలా ఉంటే తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు రేహాన్. తండ్రి ముస్తాఫా ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీలో ఖర్చులు ఎక్కవవడంతో మంగళవారం రాత్రి తన సొంత గ్రామానికి భార్యా పిల్లలను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు .అంతలోనే ఈ దారుణం జరిగిపోవడం పలువురిని కలచివేసింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో రేహాన్ ఓ గదిలో ఆడుకున్నాడని తల్లి చెప్పింది. తమ ప్రయాణానికి ఆహారం ప్యాక్ చేసేందుకు వంటగదిలోకి వెళ్లగా... ముస్తాఫా రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు ఆటో రిక్షాను తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లాడు. అదే సమయంలో కిందపడి ఉన్న మేకును తీసుకుని రేహాన్ మింగినట్లు తల్లి చెప్పింది. ముందుగా ఎక్కిల్లు వచ్చాయని ఆ తర్వాత బిడ్డ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడని తల్లి వివరించింది. ఏమైందో అర్థం కాలేదని భోరున విలపించింది తల్లి. ఇక హాస్పిటల్కు తీసుకెళ్లగా ఎక్స్రే తీయడంతో మేకు గొంతులో ఇరుక్కున్నట్లు స్పష్టంగా కనిపించిందని చెప్పారు.