కుటుంబాన్ని తిరిగి కలిపిన వన్ ఇండియా రీడర్స్
షార్జా: వన్ ఇండియా పాఠకుల స్పందనతో విదేశాల్లో ఉంటున్న ఓ తమిళ కుటుంబం నిలబడింది. తమిళనాడు రాష్ట్రంలోని తంజోర్కు చెందిన సుధేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి షార్జాలో ఉంటున్నాడు. అయితే చెక్ బౌన్స్ కేసుతో సంబంధం ఉందనే ఆరోపణలతో సుధేష్ అరెస్టయ్యాడు. కాగా వన్ఇండియా తమిళ్లో వచ్చిన సుధేష్ కథనానికి స్పందించిన పాఠకులు ఆర్థిక సహాయం చేయడంతో తిరిగి అతని కుటుంబ సభ్యులను కలుసుకోగలిగాడు.
సుధేష్కు సహాయం అందించే విషయమై వన్ఇండియా తమిళ్ పబ్లిష్ చేసిన కథనానికి చాలా మంది పాఠకులు స్పందించి అతనికి సహాయం అందించారు. వారిలో కొందరి గురించి..కర్నాటక రాష్ట్రం మంగళూరు వాసులు షార్జాలో ‘బెంగళూరు' రెస్టారెంట్ నడుపుతున్నారు. వారు సుధేష్ జైలులో ఉన్న సమయంలో ఈ రెస్టారెంట్ నుంచే అతని కుటుంబ సభ్యులకు ఆహార పదార్థాలు అందించారు.
కాగా సుధేష్ జైలులో ఉన్న సమయంలో అతని తరపున వాదించారు న్యాయవాది మహ్మద్ అలావి. అతని వాదనలతో సెప్టెంబర్ 8న సుధేష్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే సుధేష్ కుటుంబ సభ్యుల నుంచి అలావి ఎలాంటి ఫీజు తీసుకోలేదు. వన్ ఇండియా తమిళ్లో వచ్చిన కథనానికి స్పందించి సహాయం చేసిన వారికి సుధేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సుధేష్ తరపున వాదించిన న్యాయవాది అలావిని వన్ఇండియా పాఠకులు అభినందించారు.
వ్యాన్ డ్రైవర్గా సుధేష్ పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సుధేష్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వారికి ఆర్థిక సహాయం అందించాలనుకునే వారు ఫోన్: 05553 89276/ 05052 72691 నెంబర్లను సంప్రదించవచ్చు.
తమ పాఠకుల స్పందన పట్ల వన్ ఇండియా హర్షం వ్యక్తం చేస్తూ..సుధేష్ కుటుంబానికి సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతోంది.