7వ రోజు ఢిల్లీ బోర్డర్ లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు: ఢిల్లీ -నోయిడా బోర్డర్ దిగ్బంధించిన రైతులు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రులు నిన్న విజ్ఞాన్ భవన్ లో చర్చలు జరిపినా చర్చలు ఫలించలేదు . దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులు నేడు కూడా నోయిడా- ఢిల్లీ సరిహద్దులో తమ ధర్నా కొనసాగించారు.
ఢిల్లీ నోయిడా సరిహద్దుల్లో రైతుల ఆందోళనతో టెన్షన్
రైతులు ఆందోళన కారణంగా ఉత్తర ప్రదేశ్ను జాతీయ రాజధానితో కలిపే కీలక మార్గం మూసివేయబడింది. ఢిల్లీ నోయిడా సరిహద్దుల్లో బైఠాయించిన రైతులు ప్రధాన రహదారిని దిగ్బంధించారు. తమ ఆందోళన కొనసాగించారు. కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చిల్లా మార్గాన్ని ఉపయోగించకుండా ఉండాలని, దానికి బదులుగా ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ (డిఎన్డి) లేదా కలిండి కుంజ్ రహదారి ద్వారా రావాలని దేశ రాజధానికి ప్రయాణించే ప్రయాణికులకు సూచించారు.
నోయిడా-లింక్ రహదారిలోని చిల్లా సరిహద్దు మూసివేత
గౌతమ్ బుద్ ద్వార్ సమీపంలో రైతుల నిరసనల ప్రభావంతో నోయిడా-లింక్ రహదారిలోని చిల్లా సరిహద్దు మూసివేయబడింది. నోయిడాకు వెళ్లేందుకు నోయిడా-లింక్ రహదారిని నివారించాలని మరియు నోయిడాకు బదులుగా ఎన్ హెచ్-24 మరియు డిఎన్డి ను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు, ఈ మేరకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) మరియు ఇతర రైతు సంఘాలకు అనుబంధంగా ఉన్న వందలాది మంది రైతులు మంగళవారం సాయంత్రం యుపి సరిహద్దు వద్ద భారీగా చేరుకుని నిరసన కొనసాగించారు. వీరిని పంజాబ్ మరియు హర్యానా రైతులతో చేరడానికి ఢిల్లీ వైపు వెళ్ళకుండా నిరోధించడానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
వ్యవసాయ చట్టాల రద్దుకే రైతుల డిమాండ్ .. నిన్న 35 మంది రైతు ప్రతినిధులతో చర్చలు
సెప్టెంబర్లో పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ప్రకారం పెద్ద సంస్థల దోపిడీకి గురయ్యే మూడు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు ఉత్పత్తి, వాణిజ్య (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020, రైతుల ధర భరోసా మరియు వ్యవసాయ ఒప్పందం సేవల చట్టం, 2020 మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం 2020. ఈ మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్న రైతులు నిన్న 35 మంది రైతు సంఘం ప్రతినిధులతో ప్రభుత్వంతో చర్చలు జరిపారు.
ఫలించని చర్చలు ... తిరిగి కొనసాగుతున్న రైతుల ఆందోళన
అయితే చర్చలు సఫలం కాకపోవడంతో తిరిగి ఆందోళన కొనసాగిస్తున్నారు. రేపు మరోమారు రైతు సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రభుత్వం పట్టు విడవకుండా ఉంటే , రైతులు కూడా తమ ఆందోళన విరమించేది లేదని, వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే వెనుదిరిగి వెళ్తామని తేల్చి చెబుతున్నారు. అయితే ప్రభుత్వం రైతులను వ్యవసాయ చట్టాల విషయంలో నచ్చజెప్పే యోచనలో ఉంది .రైతుల ఆందోళనలు కొనసాగుతున్నా వ్యవసాయ చట్టాలను సమర్ధిస్తూ పీఎం మోడీ వ్యాఖ్యలు చెయ్యటం రైతులతో ప్రభుత్వం జరిపే చర్చలు సఫలం కావనే అనుమానాలకు కారణం అవుతున్నాయి .