ఉల్లి ధరలపై నోరు విప్పిన కేంద్ర ప్రభుత్వం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నానాటికీ పెరుగిపోతున్న ఉల్లి పాయల ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నోరు విప్పింది. కొద్ది రోజులుగా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న ఉల్లి పాయల ధరలను నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టబోతున్నామని వెల్లడించింది. నాఫెడ్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసి, సాధారణ ప్రజలకు అందుబాటు ధరలో సరఫరా చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. అప్పటి దాకా వాటి ధరలు దిగిరాకపోవచ్చని, మరి కొంతకాలం ధరల ఘాటు తప్పదని చెప్పారు. నాఫెడ్ ద్వారా పెద్ద ఎత్తున ఉల్లిని సేకరించడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. మార్కెటింగ్ శాఖ తరఫున కూడా ఉల్లిని సరఫరా చేసేలా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
క్రైస్తవ అమ్మాయిలే టార్గెట్..ఇప్పటిదాకా 4000 వేల మంది..
నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు..
దేశంలోనే అత్యధికంగా ఉల్లిని పండించే మహారాష్ట్రలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట చేతికి అందకపోవడమే ధరల పెరుగుదలకు ఓ ప్రధాన కారణమని అన్నారు. మహారాష్ట్రలో పంట దెబ్బతినడం వల్ల మార్కెట్ కు అరకొరగా ఉల్లి సరఫరా అవుతోందని, ఫలితంగా ధరలు పెరిగాయని చెప్పారు. దీన్ని తగ్గించడానికి నాఫెడ్ ద్వారా ఉల్లిని సేకరిస్తామని అన్నారు. దీనితో పాటు రాష్ట్రాల పరిధిలో ఉన్న మార్కెటింగ్ శాఖ ద్వారా కూడా ఉల్లి సేకరణ చేపట్టాల్సి ఉందని, ప్రత్యేక కౌంటర్లు, వాహనాల ద్వారా ఉల్లిని కొనుగోలుదారులకు సరఫరా చేసేలా ఆదేశాలు జారీ చనేస్తామని అన్నారు. ప్రస్తుతానికి నాఫెడ్ వద్ద ఆశించిన స్థాయిలో ఉల్లిపాయల నిల్వలు ఉన్నాయని నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.
రైతుకు మేలు..
కొన్ని సందర్భాల్లో పెరిగిన ధరల రూపంలో కొనుగోలుదారులు రైతులకు ఆర్థికంగా మేలు కలిగిస్తున్నారని తోమర్ వ్యాఖ్యానించారు. అలాగే చాలా సందర్భాల్లో రైతులు తాను నష్టపోయి, కొనుగోలుదారులకు లబ్ది కలిగించేలా తన పంట ఉత్పత్తులను అమ్ముకుంటున్నారని చెప్పారు. దీన్ని సరి చేయడానికి కొన్ని కీలక చర్యలను తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా త్వరలోనే ఓ ప్రకటన చేస్తామని అన్నారు. కాగా. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న నిల్వలన్నీ రబీ సీజన్ కు సంబంధించినవని, ఖరీఫ్ కు సంబంధించిన పంట చేతికి రావడానికి మరి కొంత సమయం పడుతుందని అన్నారు. నవంబర్ లో ఖరీఫ్ పంట చేతికి అందితే.. ధరలు వాటంతటవే తగ్గిపోతాయని చెప్పారు. అప్పటిదాకా ధరలను నియంత్రించడానికి అన్ని చర్యలు చేపడతామని తోమర్ స్పష్టం చేశారు.