రూ.35కే కిలో.. ఉల్లిగడ్డలు అమ్మిన మాజీ ఎంపీ.. బీజేపీ ఆఫీస్ బయట..
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడల్లా రాజకీయ నాయకులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయడం చాలా సాధారణంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధర ఆకాశాన్ని తాకడం చర్చనీయాంశమైంది. ఉల్లిధర పార్లమెంట్ను కూడా కుదిపేసింది. ఇలాంటి నేపథ్యంలో మాజీ ఎంపీ, జన్ అధికార్ పార్టీ కన్వీనర్ పప్పు యాదవ్ వినూత్న నిరసనకు దిగి దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆయన నిరసన ఎలా ఉందంటే..
పాట్నాలో మాజీ ఎంపీ నిరసన
ప్రస్తుతం దేశ ప్రజలను ఉల్లిధర భారీగా పెరిగి కంటతడి పెట్టిస్తున్నది. ఉల్లి ధర కిలో ఒక్కంటికి రూ.80 నుంచి రూ.100 వరకు మార్కెట్లో ట్రేడ్ అవుతున్నది. అయితే ఉల్లిధరను నియంత్రించలేని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ పాట్నాలో బీజేపీ కార్యాలయం బయట పప్పుయాదవ్ ఉల్లిగడ్డలు అమ్మి అందరి దృష్టిని ఆకర్షించాడు. ధరను నియంత్రించలేని ప్రభుత్వ తీరును ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నించారు.
రూ.35 కిలో ఉల్లిగడ్డ
సాధారణంగా రూ.100 పలుకుతున్న ఉల్లిగడ్డలను కేవలం కిలో ఒక్కంటికి రూ.35కే అమ్మడంతో స్థానిక జనం పోటెత్తారు. మాజీ ఎంపీ చవకగా ఉల్లిగడ్డలను అమ్ముతున్నారనే విషయం తెలుసుకొని వినియోగదారులు పోటీపడి క్యూ కట్టారు. దాంతో బీజేపీ కార్యాలయం వినియోగదారులతో కిక్కిరిసింది.
కేంద్రంపై పప్పు యాదవ్ నిప్పులు
ఉల్లిగడ్డ ధర పెరుగుదలపై నిరసన వ్యక్తం చేసిన అనంతరం పప్పు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ ప్రజలకు ఉల్లిగడ్డ ధర శరాఘాతంగా మారింది. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కొన్ని వారాలుగా ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఉల్లిని దిగుమతి చేసుకోవడంలో కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ విఫలయ్యారు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
పప్పుయాదవ్పై బీజేపీ ఫైర్
అయితే మాజీ ఎంపీ పప్పు యాదవ్ నిరసనపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. చవకబారు ప్రచారం కోసమే బీజేపీ ఆఫీస్ బయట ఉల్లిగడ్డలను తక్కువ ధరకు అమ్మాడని నేతలు విమర్శించారు. పప్పు యాదవ్ ఎన్ని వేషాలు వేసిన ప్రజలు పట్టించుకోరని బీజేపీ నేత ప్రేమ్ రంజన్ పటేల్ అన్నారు.