ఆ వ్యాఖ్యలపై రాహుల్ ఆగ్రహం, ఏపీలో టీడీపీ-కాంగ్రెస్.. అందుకే అన్నానని అమిత్ షా
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రతిపక్షాల్ని పాములు, కుక్కలతో పోల్చడాన్ని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. బీజేపీ సంస్థాపనా దినోత్సవం నేపథ్యంలో చేసిన వ్యాఖ్య అమిత్ మనస్తత్వానికి అద్దం పడుతోందన్నారు.
బీజేపీలో ఆయన, ప్రధాని మోడీ మినహా అద్వానీ, మురళీ మనోహర్ జోషి, గడ్కరితో పాటు ఇతరులందరూ ఎందుకూ కొరగానివారని అమిత్ షా తేల్చారన్నారు. విపక్షాలను జంతువులుగా ఆయన భావించటం బీజేపీ, సంఘ్ పరివార్ ప్రాథమిక దృక్కోణంగా భావించాలని, అది చాలా అమర్యాదకరమైన ప్రకటన అని, వారి దృష్టిలో అందరూ జంతువులే అన్నారు.
అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఖండించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గతంలో ఇలా నోరు పారేసుకోవడం వల్లనే అక్కడి లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. బీజేపీకి అధికార మత్తు ఆవహించిందన్నారు.
ముంబై సమావేశాల్లో అమిత్ షా వాడిన భాష అసభ్యంగా, అప్రజాస్వామికంగా ఉందని, మోడీ, అమిత్ షాల నాయకత్వంలో ఆ పార్టీ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలన్నారు.
ఇదిలా ఉండగా, తన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. తాను విపక్షాలను పాము, ముంగీసతో పోల్చడానికి ఓ కారణం ఉందని, ఆ రెండు జంతువులకు ఎప్పుడూ పడదని, అలాగే ఇప్పుడు బీజేపీని ఎదుర్కోలేక యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఏపీలో కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటి అవుతున్నాయన్నారు. అందుకే అలా వాటిని పోలుస్తూ చెప్పానన్నారు.