వారణాసి లో ఫలించని రైతుల నామినేషన్ వ్యూహం... కేవలం 21 నామినేషన్లు
తెలంగాణలో పెద్దఎత్తున హడావిడి చేసి, ఎన్నికల అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన నిజమాబాద్ రైతులకు వారణాసిలో మాత్రం చుక్కెదురైంది. దేశవ్యాప్తంగా పసుపు మద్దతు ధర కోసం ,కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలకు వ్వతిరేకంగా నామినేషన్లు వేసిన రైతులు ,వారణాసిలో సైతం ప్రధాని మోదీపై కూడ నామినేషన్లు వేసేందుకు నడుంబిగించారు. దీంతొ జాతియ స్థాయిలో చర్చ తీసుకురావాలని భావించారు. అయితే పలు కారణాలతో వారికి నామీనేషన్ వేసేందుకు అవకాశం దక్కలేదు. దీంతో కాసేపు ఆందోళన బాట పట్టారు.
పసుపు ,ఎర్రజోన్న రైతుల మద్దతు ధర ఉద్యమం..
పసుపు, ఎర్రజోన్నలకు మద్దతు ధర లభించాలని తెలంగాణ రాష్ట్రంలోని నిజమాబాద్ రైతులు అందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశం దృష్టిని ఆకర్షించేందుకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 177 మంది రైతులు ఇండిపెండెంట్ గా నామీనేషన్ వేశారు. దీంతో 12 ఈవీఎంలతో అక్కడ పోలీంగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. నిజామాబాద్ రైతుల నామినేషన్లతో ఈవీఎం ల దగ్గర నుండి పోలీంగ్ అయ్యో వరకు ప్రతి ఒక్కటి రికార్డ్ గానే నిలిచింది.
నిజామాబాద్ స్పూర్తితో వారణాసిలో నామినేషన్లు
నిజమాబాద్ పార్లమెంట్ స్థానంలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి విజయం సాధించిన రైతులు ఇదే స్పూర్తితో ప్రధాని మోడి పోటి చేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో సైతం నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. ఏకంగా మోడిపై వేయడం ద్వార తమ లక్ష్యానికి మరింత చేరువ కావచ్చని భావించారు. దీంతో వారణాసికి సైతం మొత్తం 53 మంది రైతులు నామినేషన్ వేసేందుకు క్యూ కట్టారు.
మూడు రోజుల క్రితమే వారణాసి వెళ్లిన రైతులు
నామినేషన్లు వేసేందుకు రైతులు మూడు రోజుల క్రితమే వారణాసికి చేరుకున్నారు. అయితే వారణాసికి క్యూ కట్టిన రైతులకు నిరాశ ఎదురైంది. మొత్తం మంది నామినేషన్లు వేయడానికి వెళ్లినప్పటికి వారికి ప్రతిపాదించేవారు లేకపోవడంతో అనుకున్న స్థాయిలో నామినేషన్లు వేయలేకపోయారు. చివరి రోజు కావడంతో నామినేషన్ ప్రక్రియను అధికారులు కావాలనే ఆలస్యం చేశారని తెలిపారు. దీనికి తోడు ఎన్నికల సంఘం అధికారులు సైతం పలు ఇబ్బందులు పెట్టినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేవలం 20 మంది రైతులు మాత్రమే నామినేషన్లు వేశారు.
రిటర్నింగ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన రైతులు...
వారణాసి వెళ్లిన రైతులను అక్కడి పోలీసులు, అధికారులు చుక్కలు చూపించారు. రైతులు బస చేసిన హోటళ్లలో పలు తనిఖీలు చేసి ఇబ్బందులకు గురిచేశారని , నామినేషన్ వేసేందుకు కావల్సిన ప్రతిపాదకులను సైతం బెదిరించారని రైతులు వాపోయారు. ఈనేపథ్యంలోనే మధ్యహ్నాం వరకు తమకు నామినేషన్ పేపర్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు దీంతో రిటర్నింగ్ కార్యాలయం ముందే ధర్నా కొనసాగించినట్టు రైతులు తెలిపారు.