డిజిటల్ వివక్ష: భారత్లో ఇంటర్నెట్ వినియోగించే మహిళలు ఎంతమందో తెలుసా?
న్యూఢిల్లీ: హర్యానా లాంటి కాప్ పంచాయితీలు రాజ్యమేలే రాష్ట్రంలో మహిళలు స్మార్ట్ ఫోన్లు వినియోగించరాదన్న నిబంధనలను ఇప్పటికీ వింటూనే ఉన్నాం. ఒక్క ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోని ఏ రాష్ట్రంలోను స్మార్ట్ ఫోన్ వినియోగించే మహిళల సంఖ్య చాలా తక్కువ గానే ఉంది.
డిజిటల్ సాంకేతిక అభివృద్ధివైపు దేశం దూసుకెళ్తోందని గొప్పలు చెప్పుకుంటున్నా.. ఇందులోను వివక్ష బయటపడుతూనే ఉంది. యునిసెఫ్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో కేవలం 29శాతం మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు తేలింది.
భారత్లో మహిళలు, బాలికల సాంకేతిక వినియోగంపై యునిసెఫ్ రూపొందించిన 'స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ 2017: చిల్డ్రన్ ఇన్ డిజిటల్ వరల్డ్' నివేదికలో ఈ విషయాలను పొందుపరిచింది.
2017లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారిలో మహిళలతో పోలిస్తే 12శాతం ఎక్కువ మంది పురుషులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకున్నట్లు అందులో వెల్లడించారు. అదే సమయంలో భారత్ లో ఇంటర్నెట్ వినియోగిస్తున్న మహిళల సంఖ్య కేవలం 29శాతం మాత్రమేనని చెప్పారు.
దేశంలోని చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను ఇంటర్నెట్ వాడకుండా నియంత్రిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. దీని ప్రభావం లింగ వివక్ష మహిళల విద్య, నైపుణ్యాలు, ఆరోగ్యంపై కూడా పడుతుందని యునిసెఫ్ పేర్కొనడం గమనార్హం.