పిల్లల ఆటలా ?వీడియో గేమా ? :యూపీఏ హయాంలో రిమోట్ పాలన, కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్స్పై మోదీ విసుర్లు
సికర్ : ఎన్నికల వేళ అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ హయాంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేశామనే కామెంట్లపై ప్రధాని మోదీ స్పందించారు. ఇవాళ రాజస్థాన్లోని సికర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ .. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సర్జికల్ స్ట్రైక్స్ అంటే వీడియో గేమ్ అనుకుంటుందేమోనని సెటైర్లు వేశారు.
వీడియో గేమ్ కాదు
సర్జికల్ స్ట్రైక్స్ అంటే కాంగ్రెస్ పార్టీకి అర్థం తెలుసా ? శత్రుదేశంపై దాడి చేయడమని .. కానీ కాంగ్రెస్ పార్టీ వీడియో గేమ్ ఆడినట్టుు అనుకుంటుందని దుయ్యబట్టారు. అందుకోసమే మేం కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేశామని చెప్తుందని విమర్శించారు మోదీ. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేశామని చెబుతోన్న కాంగ్రెస్ పార్టీ కామెంట్లపై కూడా ఫైరయ్యారు మోదీ. ఎన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేశామనేది ముఖ్యం కాదు, అదీ ఓ పేపర్ రాయడమో లేదంటే వీడియో గేమ్ ఆడటమో కాదని స్పష్టంచేశారు.
దాడులంటే ఆటలా ?
యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ చాలా జరిగాయని నిన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. దీనిపై మోదీ స్పందిస్తూ .. యూపీఏ హయాంలో 6 సర్జికల్ స్ట్రైక్స్ చేశారని చెప్తున్నారు. అదేలా సాధ్యం .. లక్షిత దాడులంటే .. పిల్లల ఆటనా అని ఉద్గాటించారు మోదీ. అంతేకాదు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్టు యూపీఏ ప్రభుత్వంలో మంత్రులకైనా తెలుసా అని అనుమానం వ్యక్తం చేశారు మోదీ.
ఎవరికీ తెలుసు ?
కాంగ్రెస్ హయాంలో చేసిన ఆరు సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేశారు ? వాటి సరళి ఎలా ఉంది ? యూపీఏ చేసినా దాడుల గురించి కనీసం ఉగ్రవాదులకైనా తెలుసా అని ప్రశ్నించారు. వారికే కాదు పాకిస్థాన్, భారత్ లోని ప్రజలకు ఎవరికీ తెలియదని దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో రిమోట్ కంట్రోల్లో పాలన జరిగిందని గుర్తుచేశారు. సర్జికల్ స్టైక్స్కు సంబంధించి కనీసం మీడియాకు సమాచారం ఉందా అని నిలదీశారు. ఏ ఒక్క వార్త పేపర్ లో దీనికి సంబంధించి సమాచారం వచ్చిందా అని అడిగారు మోదీ.
ఓట్ల కోసమే ..
యురీ దాడి తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన దాడులతో .. కాంగ్రెస్ పార్టీ తాము కూడా దాడి చేసిందని పేర్కొన్నారు మోదీ. ప్రజల నుంచి వచ్చే సానుకూలతను క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రగా అభివర్ణించారు.