సంచలన నిర్ణయం : 2025 నుంచి ఐసీ ఇంజిన్ బైక్లపై నిషేధం?
ఢిల్లీ : ప్రపంచ దేశాలన్నింటికీ కాలుష్యం అతిపెద్ద సమస్యగా మారిపోయింది. అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్ తదితర దేశాల్లో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది. వాహనాల కారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయికి చేరిందంటే సుప్రీంకోర్టు దాన్ని గ్యాస్ ఛాంబర్తో పోల్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాలుష్యానికి చెక్ పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న ఐదేళ్లలో పొల్యూషన్ ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాత్రమే విక్రయించేలా చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
2025 నాటికి ఎలక్ట్రిక్ బైక్లు
దేశంలో వాయు కాలుష్యం ఏ స్థాయికి చేరిందంటే కఠిన నిర్ణయాలు అమలుచేయని పక్షంలో పరిస్థితి చేజారిపోయే పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రెండోసారి రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ గడ్కరీ పక్కా ప్లాన్తో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించి ఇప్పటికే ఓ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దాని ప్రకారం పెట్రోల్, డీజిల్తో నడిచే టూ వీలర్, త్రీ వీలర్స్ను బ్యాన్ చేయనున్నారు. 2023 నుంచి త్రీవీలర్, 2025 నుంచి టూవీలర్స్పై నిషేధం అమలుకానున్నట్లు సమాచారం.
ఐసీ ఇంజిన్ల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్
పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల వాహనాలపై నిషేధం విధించనున్న కేంద్రం వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. 2013 నుంచి ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, 2025 నుంచి 150 సీసీ ఎలక్ట్రిక్ టూవీలర్స్ మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ వెహికిల్స్ రాకతో కాలుష్యం గణనీయంగా తగ్గుతుందన్నది కేంద్రం ఆలోచన. ప్రస్తుతం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పని మొదలైందని, అన్ని అనుమతులు లభించిన వెంటనే వారం నుంచి పది రోజుల్లో మిగతా ప్రక్రియ పూర్తవుతుందని విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత ఆటోమొబైల్ కంపెనీలతో సంప్రదింపులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
అమలు సాధ్యమేనా?
ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో భారత్ది అతిపెద్ద వాటా. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 21 మిలియన్ల ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది ఐదు శాతం ఎక్కువ. వీటిలో 80శాతం వాటా 150సీసీ బైక్లదే కావడం విశేషం. ఇక గత ఆర్థిక సంవత్సరంలో త్రీ వీలర్ విక్రయాలు సైతం 10శాతం మేర పెరిగి 7లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు ఐసీ ఇంజన్ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసి, ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపు మళ్లుతాయా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.