జయలలిత ముందు: రజనీకాంత్పై దినకరన్ సంచలనం, 'వెనుక బీజేపీ, బలం తేలనుంది'
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన రాజకీయ ఆరంగేంట్రంపై దేశవ్యాప్తంగా చాలామంది స్పందిస్తున్నారు. ఆయన రాజకీయ ఆరంగేట్రాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఆర్కే నగర్ నుంచి గెలిచిన దినకరన్ కూడా స్వాగతించారు.
రజనీకాంత్ ప్రకటన-పవన్ కళ్యాణ్పై తీవ్రవ్యాఖ్యలు: వర్మ సూచన, మహేష్ కత్తి ఘాటుగా
అయితే, ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి ఎంతమంది వచ్చినా రాష్ట్రంలో జయలలిత స్థానాన్ని భర్తీ చేసేవారు ఎవరూ ఉండరని అన్నారు. అమ్మ జయలలిత విశ్వసనీయత ముందు ఏ కొత్త ముఖం నిలవదన్నారు. ఆయనలాగే మరికొంతమంది రజనీపై విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడారు.
రజనీకాంత్ భర్తీ చేయలేరని
తమిళనాడులో ఉన్నది ఒక అమ్మ, ఒక ఎంజీఆర్ మాత్రమేనని దినకరన్ వ్యాఖ్యానించారు. వీరితో ఎవరినైనా పోల్చి చూసుకోవచ్చునని చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మీడియాలోని ఇదే పతాక శీర్షిక. తద్వారా రజనీకాంత్ వారిని భర్తీ చేయలేరని అభిప్రాయపడ్డారు.
రజనీకాంత్ ఏమిటో తేలిపోనుంది
ఎన్నికల్లో పోటీ చేస్తే రజనీకాంత్ ఏమిటో తేలిపోనుందని దినకరన్ చెప్పారు. రజనీ వల్ల తమ ఓటు బ్యాంకుకు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. తమిళ ఓటర్ల పైన తమకు నమ్మకం ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా రజనీకాంత్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవని, ఆయన ఆ తర్వాతే పార్టీ పేరును ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.
అప్పుడు స్పందిస్తా
ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చునని ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. అన్నాడీఎంకేను ఎవరూ ఏం చేయలేరని చెప్పారు. రజనీకాంత్ అభిప్రాయాలు, లక్ష్యాలు పూర్తిగా తెలుసుకున్నాక స్పందిస్తామని చెప్పారు.
ప్రజాబలం తేలిపోనుంది
రజనీకాంత్ వెనుక బీజేపీ ఉందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఆరోపించారు. రజనీ మాయమాటలకు తమిళ ప్రజలు మోసపోయే స్థితిలో లేరన్నారు. పెరియార్ పుట్టిన ఆత్మగౌరవం మెండుగా ఉన్న తమిళనాట ఆధ్యాత్మిక రాజకీయాలకు తావులేదన్నారు. రజనీ వెనుక బీజేపీ అండగా ఉందనే అనుమానం కలుగుతోందని, ఆయన రాజకీయాల్లోకి రావడం వల్ల ప్రజాబలం తేలిపోనుందన్నారు.