యూటర్న్: 51 మంది కాదు..ఇద్దరేనట
తిరువనంతపురం: రాజకీయాల్లో యూటర్న్ అనే పదం బాగానే క్లిక్ అయ్యేటట్టుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు యూటర్న్ అంకుల్ అని పేరు పెట్టారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. దీనిపై చంద్రబాబు కూడా అప్పుడప్పుడు ఘాటుగానే స్పందిస్తున్నారు. యూటర్న్ తనది కాదని, నరేంద్రమోడీదేనని ఆయన ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తున్నారు. అదలావుంచితే- తాజాగా కేరళలోని వామపక్ష ప్రభుత్వం కూడా యూటర్న్ తీసుకుంది. తాను చేసిన ప్రకటనను తానే ఖండించుకుంది అక్కడి ప్రభుత్వం.
శబరిమల ఆలయంలోకి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన తరువాత.. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి మహిళలు ఎగబడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సూచించినట్టు 50 ఏళ్ల లోపు మహిళలు శబరిమల ఆలయానికి చేరుకోవడానికి ప్రయత్నించగా.. భక్తులు వారిని అడ్డుకున్నారు. చాలామందిని వెనక్కి పంపించేయగలిగారు. ఈ ఘటన కేరళలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలకు దారి తీసింది కూడా. నిరసన ప్రదర్శనలు చేశారు. ర్యాలీలను నిర్వహించారు. బంద్ కూడా పాటించారు కేరళలోని అయ్యప్పస్వామి భక్తులు.
అయినప్పటికీ- ఇద్దరు మహిళలు మాత్రం సన్నిధానం వరకూ వెళ్లగలిగారు. కిందటి నెల 2వ తేదీన వారు అయ్యప్పను దర్శించగలిగారు. దీనికోసం స్థానిక పోలీసులు వారికి సహకరించారు. ఆ ఇద్దరే- కనకదుర్గ, బిందు. వారిద్దరి వయస్సు 45 సంవత్సరాల లోపే. అయ్యప్ప మాల వేసుకున్నట్టుగా వస్త్రధారణ చేసుకుని, 18 మెట్లు ఎక్కి మరీ మూలవిరాట్టును దర్శించుకున్నారు.
ఈ ఘటన తరువాత.. 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న ఎంతమంది మహిళలు శబరిమల ఆలయాన్ని సందర్శించారో వివరంగా తెలియజేస్తూ ఓ నివేదికను అందజేయాలని సుప్రీంకోర్టు కేరళలోని పినరయి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించిన కేరళ ప్రభుత్వం.. ఓ తప్పుడు నివేదికను అందజేసింది. ఏకంగా 50 సంవత్సరాల లోపు మహిళలు 51 మంది అయ్యప్పను దర్శించినట్లు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై వివాదలు చెలరేగాయి. అంత పెద్ద సంఖ్యలో మహిళలు రాలేదంటూ వార్తలు వెలువడ్డాయి. ప్రభుత్వం పేర్కొన్న సంఖ్య సరికాదని, ఉద్దేశపూరకంగానే తప్పుడు నివేదికను సుప్రీంకోర్టుకు అందించిందని విమర్శించారు భక్తులు.
అప్పట్లో ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు కేరళ సర్కార్. తాజాగా- అసెంబ్లీలో మరో భిన్న ప్రకటన చేసింది. అయ్యప్ప స్వామిని దర్శించుకున్నది ఇద్దరేనని దేవస్వోమ్ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కనకదుర్గ, బిందు మాత్రమే అయ్యప్పను దర్శించారని అన్నారు. శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళ అయ్యప్పను దర్శించారా? లేదా? అనేది తెలియ రావాల్సి ఉందని అన్నారు. శశికళ దర్శనం చేసుకున్నారనే విషయంపై తన వద్ద సరైన సమాధానం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, పోలీసుల నుంచి దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉందని చెప్పారు.
50 ఏళ్లలోపు వయస్సు ఉన్న మహిళలు శబరిమల ఆలయాన్ని సందర్శించవచ్చని గత ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి స్వామివారి గుడి తలుపులు మూసే వరకు ఎంతమంది 50 ఏళ్ల లోపు మహిళలు శబరిమలకు వెళ్లారని కాంగ్రెస్ సభ్యుడు అసెంబ్లీలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మంత్రి సురేంద్రన్ సమాధానం ఇచ్చారు. దీనితో కేరళ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు అందజేసిన నివేదిక సరైనది కాదని అధికారికంగా నిర్దారణ అయినట్టే.