అసంఘటిత కార్మికుల పెన్షన్ విధానంలో కేంద్రం ట్విస్ట్..అర్హులు ఎవరు..?
అసంఘటిత కార్మికులకు కొత్త పెన్షన్ స్కీమును కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రకటించారు. కేంద్రమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఈ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ అయితే జారీచేసింది కానీ... ఇందులో ఒక మెలిక పెట్టింది ప్రభుత్వం.
కేంద్రం పెట్టిన మెలిక ఏంటి...?
కొత్తగా ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో 40 ఏళ్లలోపు ఉన్న వారు మాత్రమే ఈ పెన్షన్కు అర్హులుగా ఉంది. కేంద్రం మెలికపెట్టడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇక పెన్షన్ పథకం గురించి స్పష్టమైన వివరణ ట్రేడ్ యూనియన్ కార్మికులకు తెలపలేదు. కార్మికుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కేంద్రప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు మళ్లిస్తోందని ధ్వజమెత్తారు. సామాజిక భద్రతకు సంబంధించి నిజమైన అర్హులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత డబ్బులు ఇస్తారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు.
60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత వస్తుంది..?
ఇక అంసఘటిత కార్మికులు దాదాపు 42 కోట్లు మంది ఉన్నారు. అయితే రానున్న ఐదేళ్లలో పెన్షన్ పథకం ద్వారా కనీసం 10 కోట్ల మంది లబ్ధి పొందుతారని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న అసంఘటిత కార్మికుడికి నెలకు రూ.15000 కంటే తక్కువగా ఆదాయం ఉంటే.... ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ -ధన్ 2019కు దరఖాస్తు చేసుకోవచ్చని ఉంది. పథకంలో భాగంగా 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.3000 పెన్షన్ వస్తుంది. అయితే నామినీగా బీమా చేసిన వ్యక్తి భార్య కానీ భర్తకానీ ఉంటారు. మధ్యలో పాలసీదారుడు మృతి చెందితే 50 శాతం డబ్బులు నామినీకి వస్తాయని నోటిఫికేషన్లో ఉంది.
పాలసీదారుడు మరణిస్తే ఎవరు కొనసాగించొచ్చు..?
ఒకవేళ పాలసీదారుడు, నామినీ కూడా మరణిస్తే ఆ డబ్బులు పెన్షన్ ఫండ్కు చేరుతుంది. 18 ఏళ్ల వయస్సులోనే పాలసీ తీసుకుంటే నెలకు రూ. 55 కట్టాల్సి ఉంటుంది. అదే 29 ఏళ్ల వయస్సులో పాలసీ చేస్తే నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 40 ఏళ్ల వయస్సులో పాలసీ తీసుకుంటే రూ.200 కట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం తరపున కూడా డబ్బులు చెల్లించడం జరుగుతుంది. ఒక వేళ పాలసీదారుడు మధ్యలో కట్టలేక పోయి ఆ తర్వాత మళ్లీ పాలసీని కొనసాగించాలంటే కట్టని ప్రీమియంతో పాటు వడ్డీ కూడా కట్టి పాలసీని కొనసాగించొచ్చు. అయితే అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సింది పోయి..కార్మికులతోనే 20 ఏళ్లు పాటు డబ్బులు కట్టించుకుంటోందని విమర్శించారు సీఐటీయూ నాయకులు.
ఎవరు అర్హులు..ఎవరు అనర్హులు
ఇక ఈ పెన్షన్ స్కీములో చేరాలంటే... అసంఘటిత కార్మికుడికి ఒక బ్యాంకు ఖాతాతో పాటు ఆధార్ నెంబర్ కూడా కలిగి ఉండాలి. అయితే ఇప్పటికే ఆ కార్మికుడు జాతీయ పెన్షన్ స్కీమ్, ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ల కింద నమోదు అయి ఉంటే అలాంటి వారు ఈ స్కీముకు అర్హులు కారు. ఇక స్కీములో ఉండటం ఇష్టం లేకపోతే 10 ఏళ్లలోగా బయటకు వచ్చేయొచ్చు. 10 ఏళ్ల తర్వాత అప్పటి వరకు కట్టిన డబ్బులను వడ్డీతో కలిపి నేరుగా బ్యాంకు ఖాతాలోకి వేస్తారు. పాలసీదారుడు మధ్యలోనే మరణిస్తే నామినీ పాలసీదారుడిగా కొనసాగవచ్చు లేదా అప్పటి వరకు జమ అయిన డబ్బులతో పాటు వడ్డీని కూడా తీసుకెళ్లొచ్చు.