విజయ్ మాల్యా చాలా స్మార్ట్, బ్యాంకులు, నేతలకు..: కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Recommended Video
హైదరాబాద్: బ్యాంకులకు సుమారు రూ.9వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయి తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై ప్రశంసలు కురిపించి ఇరుకునపడ్డారు కేంద్రమంత్రి జ్యూయల్ ఓరమ్. విజయ్ మాల్యా చాలా చురుకై(స్మార్ట్)న వ్యక్తి అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలకు తావిచ్చాయి.
జాతీయ గిరిజన ప్రారిశ్రామికవేత్తల సదస్సు 2018లో కేంద్రమంత్రి ఓరమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. వారికి విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించారు. గిరిజనులు చురుకుగా మారి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదిగి బ్యాంకు రుణాలు పొందేందుకు అర్హులుగా మారాలి' అని పిలుపునిచ్చారు.
అంతేగాక,'మనం పారిశ్రామికవేత్తలుగా మారాలి. తెలివిగా, చురుకుగా మారాలి. సమాచారాన్ని సేకరించాలి. సమాచారమే శక్తి. సమాచారం ఉన్న వాళ్లే అధికారాన్ని నియంత్రించగలుగుతారు' అని మంత్రి వివరించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. విజయ్మాల్యాను గురించి ప్రస్తావించిన విషయాలే విమర్శలు తెచ్చిపెట్టాయి.
'విజయ్మాల్యాను అందరూ విమర్శిస్తారు? కానీ విజయ్ మాల్యా అంటే ఏమిటి? ఆయన చాలా స్మార్ట్. ఆయన చాలా మంది చురుకైన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారు. అంతేగాక, బ్యాంకర్లు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం కోసం ఎంతో కొంత చేశారు' అంటూ ఓరమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో విపక్ష పార్టీల నేతల ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న మంత్రి
'అనుకోకుండా మాల్యా విషయం తీసుకొచ్చా. అయితే ఉద్దేశపూర్వకంగా చేయలేదు. తెలివైన వ్యక్తి అని మరొకరి పేరు చెప్పి ఉంటే బాగుండేది. వా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని' కేంద్ర మంత్రి ఓరమ్ వివరణ ఇచ్చారు.