విజయ్ మాల్యా కేసు: బ్యాంకు అధికారుల పాత్రపై సీబీఐ దృష్టి
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్లు కొల్లగొట్టి బ్రిటన్లో తలదాచుకున్న విజయ్ మాల్యా కేసును సీబీఐ దర్యాఫ్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎస్బీఐకి చెందిన ఉన్నతాధికారులపై విచారణ సంస్థ దృష్టి సారించింది. ఈ కేసులో బ్యాంక్కు చెందిన టాప్ అధికారుల పాత్ర ఎవరిదైనా ఉందా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
ఎస్బీఐ మాజీ అధికారి భట్తో పాటు మరో పది మందికి పైగా అధికారులపై విచారణలో భాగంగా సీబీఐ దృష్టి సారించిందని తెలుస్తోంది. భట్ 2006 నుంచి 2011 మధ్య చైర్మన్గా ఉన్నారు.
ఇదిలా ఉండగా, విజయ్ మాల్యా ప్రస్తుతం నివసిస్తున్న లండన్ రీజెంట్ పార్క్లోని ఇంటిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. రూ.వందల కోట్లు విలువ చేసే ఈ విలాసవంతమైన ఇంటిని ఇప్పుడు యూబీఎస్ బ్యాంకు జప్తు చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మాల్యా కుటుంబ ట్రస్ట్కు చెందిన రోస్ క్యాపిటల్ వెంచర్స్ గతంలో ఈ ఇంటిని తనఖా పెట్టి యూబీఎస్ బ్యాంకు నుంచి దాదాపు రూ.19 వందల కోట్ల రుణం తీసుకుంది. దీనిని తిరిగి చెల్లించలేదు.
దీంతో యూబీఐ బ్యాంక్ ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కింది. మాల్యా, ఆయన కుటుంబం ఇందులో నివసిస్తోంది. ఈ ఇంటిని మరింత బాగు చేయాలనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో యూబీఐ బ్యాంక్ షాకిచ్చింది. దీంతో దీనిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
బ్యాంకుకు గడువులోగా రుణాలు చెల్లిస్తామమని, వాటిని ఇవ్వలేదని, అందుకే మాల్యా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతివ్వాలని లండన్ కోర్టును యూబీఐ బ్యాంక్ కోరింది. అయితే ముందస్తు నోటీసు లేకుండనే గడువు ముందే యూబీఐ బ్యాంక్ జఫ్తు కోరుతోందని రోస్ క్యాపిటల్ వెంచర్స్ తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. రుణం చెల్లింపుకు చట్టబద్దమైన నిరీక్షణ కోరామన్నారు.
దీనిపై యూబీఐ బ్యాంక్ స్పందిస్తూ.. కింగ్ ఫిషర్ కోసం తీసుకున్న రుణాలు మాల్యా ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొట్టారని మీడియాలో వార్తల వల్ల మాల్యాతో, అతని అనుబంధ సంస్థలతో సంబంధాలు తెంచుకునే ఉద్దేశ్యంతో జఫ్తు కోరుతున్నట్లు తెలిపింది. రుణం గడువు తేదీ గత ఏడాది మార్చి నెలతో పూర్తయిందని తెలిపింది.