"గాంధీకి లేవా ఎఫైర్స్! ఆప్ మంత్రికి ఉండడంలో తప్పేంటి?"
న్యూఢిల్లీ : ఇద్దరు మహిళలతో ఆప్ మంత్రి సందీప్ కుమార్ సాగించిన శృంగారం.. సీడీల రూపంలో సీఎం కేజ్రీవాల్ కు చేరడం, ఆపై సందీప్ కుమార్ ను పదవిని తొలగించడం తెలిసిన విషయమే. తాను దళితుడినవడం వల్లే ఈ కుట్రంతా జరిగిందని సందీప్ కుమార్ ఆరోపిస్తుండగా.. సందీప్ కుమార్ అండగా మరో ఆమ్ ఆద్మీ నేత అశుతోష్ ఓ బహిరంగ లేఖ రాశారు.
నెహ్రూ, గాంధీ లాంటి మహోన్నత వ్యక్తులే మహిళలతో సంబంధాలు కొనసాగించగా లేనిది.. సందీప్ కుమార్ 'శృంగారంలో పాల్గొంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు అశుతోష్. 'శృంగారం అనేది అత్యంత సహజమని, పరస్పర అంగీకారంతో మహిళలతో శృంగారంలో పాల్గొనడం తప్పెలా అవుతుందని ఇదేమి రేప్ కాదని ఢిల్లీ సర్కార్ ను నిలదీస్తున్నారు.
ఓ వ్యక్తి శృంగారంలో పాల్గొనడాన్ని బట్టి అతని వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేస్తారని, అసలు దీన్ని పార్టీకి పబ్లిక్ కు ముడిపెట్టి చూడాల్సిన అవసరమేముందని అశుతోష్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. సామాజిక కట్టుబాట్లను పాటించే భారతదేశంలో చాలామంది నాయకులు దాని వెలుపల శృంగార కోరికలు తీర్చుకున్నారని లేఖలో పేర్కొన్నారు అశుతోష్.
ఇందుకు నెహ్రూ, గాంధీ లాంటి నాయకులను ఉదాహరణగా చెప్పుకురావడం గమనార్హం. నెహ్రూకు చాలామంది మహిళలతో సంబంధాలుండేవని అవన్నీ హాట్ గాసిప్స్ గా ఉండేవి తప్పితే ఆయన రాజకీయాలకు అడ్డురాలేదన్నారు. ఎడ్విన్ మౌంట్ బౌటన్ తో నెహ్రూ సాగించిన సంబంధాలు జగమెరిగిన సత్యమని చెప్పుకొచ్చారు. నెహ్రూ జీవితం తుది దశలోను ఆమెతో సంబంధాలు కొనసాగించారని, అదేమి పాపమా అంటూ ప్రశ్నించారు.
గాంధీకి ఎఫైర్ :
రబీంద్ర నాథ్ ఠాకూర్ కు దూరపు బంధువైన సరళా చౌదరితో గాంధీకి ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందేనని.. ఈ విషయమై అప్పట్లో కాంగ్రెస్ అగ్రనేతలంతా బాధపడుతుండేవారని, ఇది చరిత్ర చెబుతోన్న విషయమని గుర్తు చేశారు అశుతోష్. సరళా చౌదరిని తన ఆధ్యాత్మిక భార్య అని గాంధీ ఒప్పుకోవడంతో.. కస్తూరీ గాంధీ చాలా ఆవేదన చెందారని అన్నారు.
సి. రాజగోపాల్ లాంటి సీనియర్ నేతలు అప్పట్లో గాంధీ సరళా చౌదరి సంబంధం విషయంలో కలగజేసుకున్నారని, సరళను దూరం పెట్టాల్సిందిగా గాంధీకి పలుమార్లు విజ్ఞప్తి చేశారని అశుతోష్ వివరించారు. అనంతర కాలంలో తనలోని నిగ్రహాన్ని పరీక్షించేందుకు గాంధీ తన ఇద్దరు మేనకోడళ్లతో కలిసి నగ్నంగా పడుకునేవారనే ప్రస్తావన కూడా ఉంది. ఈ విషయమై నెహ్రూ గాంధీని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని బహిరంగ లేఖలో అశుతోష్ తెలియజేశారు.
ఇక బీజేపీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విషయాన్ని కూడా ప్రస్తావించారు అశుతోష్. తాను పెళ్లి చేసుకోకపోయినప్పటికీ బ్రహ్మచారిని కాదన్న విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారని, ఆయన తన కాలేజీ స్నేహితురాలితో కలిసి జీవించిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.
బలవంతపెట్టడం.. మోసం చేయడం లాంటివి లేకుండా.. స్త్రీ పురుషుల మధ్య సంబంధం కొనసాగితే తప్పు కాదన్న విషయాన్ని సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియా ప్రస్తావించేవారన్నారు అశుతోష్. పెళ్లి చేసుకోకపోయినా.. వాళ్లిద్దరు జీవితాంతం కలిసి జీవించారని గుర్తుచేశారు అశుతోష్.