ఆపరేషన్ కమల: నలుగురు మంత్రులు రాజీనామా ? అసమ్మతి, సంచలన నిర్ణయం, బీజేపీ దెబ్బ !
బెంగళూరు: కర్ణాటకలో ఆపరేషన్ కమల రసవత్తరంగా మారిపోయింది. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి నేతృత్వంలోని నలుగురు మంత్రులు సైతం తాము రాజీనామా చేస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్దల ముందు వాపోయారని తెలిసింది. తాము రాజీనామా చేస్తే ఆ పదవులు వేరే ఎమ్మెల్యేలకు ఇవ్వాలని అంటున్నారని తెలిసింది.
కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం సమన్వయ సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నలుగురు మంత్రులు అసహనం వ్యక్తం చేశారని సమాచారం.
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు గాలం వేస్తుంటే సీఎం. కుమారస్వామి తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నలుగురు మంత్రులు వాపోయారని తెలిసింది. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామితో చర్చించి అసమ్మతి ఎమ్మెల్యేలకు నచ్చచెప్పించాలని, వారి డిమాండ్లు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని నలుగురు మంత్రులు అన్నారని సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ తో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, సీనియర్ మంత్రులు డీకే. శివకుమార్, కేజే, జార్జ్, క్రిష్ణభైరేగౌడ, ప్రియాంక ఖార్గే తదితరులు భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించారని సమాచారం.
అసమ్మతి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులుతో పాటు నామినేటెడ్ పదవులు ఇచ్చి వారికి నచ్చ చెప్పాలని సిద్దరామయ్యకు మనవి చేశారని తెలిసింది. లేకుంటే బీజేపీ నాయకుల ఆపరేషన్ కమలతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందని సీనియర్ మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది.