ప్రభుత్వంతో విభేదించడం దేశద్రోహం కాదు- ఫరూక్ అబ్దుల్లా కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా భావప్రకటనా స్వేచ్ఛపై భిన్నస్వరాలు వినిపిస్తున్న వేళ సుప్రీంకోర్టు ఇవాళ ఓ కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తం చేసే అభిప్రాయాలను దేశద్రోహంగా పేర్కొంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వాలు, పోలీసులకు ఇది గట్టి షాక్ ఇచ్చేలా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు చేసే వారికి గుణపాఠంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉంది.
జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా ఫరూక్ అబ్దుల్లా దేశద్రోహానికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలకు ఆదేశించాలని కోరుతూ ఇది దాఖలైంది. దీన్ని విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
అదే సమయంలో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేయడం దేశద్రోహం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఫరూక్ అబ్దుల్లా ఆర్టికల్ 370 పునరుద్ధరణపై చైనా, పాకిస్తాన్ మద్దతు తీసుకుంటామని చెప్పినట్లు ఆరోపించిన పిటిషనర్ దాన్ని నిరూపించడంలో విఫలమయ్యారు. దీంతో పిటిషనర్పై ఆగ్రహం వ్యక్ం చేసిన సుప్రీం ధర్మాసనం రూ.50 వేల జరిమానా విధించింది.