డీఎంకేకు 124: జయకు సర్వే షాక్, ఆమె వేధింపు మరిచిపోను: కరుణ
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితకు చుక్కెదురు కానుందా? అంటే లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులు చేసిన సర్వేలో అవుననే తేలింది. తమిళనాడులో జయదే విజయమని చాలామంది భావిస్తున్నారు. సర్వేలో మాత్రం రివర్స్ తేలింది.
ఎన్నికల్లో జయలలితకు పరాభవం తప్పదని, తదుపరి ప్రజలు డీఎంకేకు పట్టం కట్టనున్నారని చెన్నై లయోలా కాలేజ్ పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. స్పష్టమైన మెజార్టీతో కరుణానిధి నేతృత్వంలోనీ డీఎంకే పీఠం అధిరోహించనుందని పూర్వవిద్యార్థుల సంఘం సమన్వయకర్త తిరునావుక్కరసు తెలిపారు.
ఆయన సర్వే వివరాలు తెలిపారు. డీఎంకేకు 124 సీట్లలో గెలుస్తుందని, అన్నాడీఎంకే 90 స్థానాలకు పరిమితమవుతుందని చెప్పారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 28 మధ్య రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని సర్వేలో భాగంగా ప్రశ్నించామన్నారు.
జయలలితపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిందన్నారు. అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అత్యధికులు వెల్లడించారన్నారు. డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమికి 16 శాతం మంది మద్దతు పలికారన్నారు. తృతీయ కూటమితో అన్నాడీఎంకే ఓట్లు చీలనుండటం, డీఎంకేకు వరం కానుందన్నారు. డీఎంకేకు 39.04 శాతం, అన్నాడీఎంకేకు 35.22 శాతం ఓట్లు రానున్నాయని అంచనా వేశారు.
జయ వేధింపులు మర్చిపోలేను: కరుణానిధి
తన రాజకీయ జీవితంలో జయలలిత వేధించిన తీరును ఎప్పటికీ మరిచిపోలేనని డీఎంకే అధినేత కరుణానిధి చెప్పారు. ఆమె తనను, తన కుటుంబాన్ని, బిడ్డలను, చివరకు తన కోడళ్లను కూడా తీవ్రంగా వేధింపులకు గురి చేసిందన్నారు. ఓ సందర్భంలా ఓ వేధింపులు తనను అమితంగా బాధించాయని, అయితే అదే సందర్భంలో కష్టాన్ని తట్టుకొని పోరాడే శక్తిని ఇచ్చాయన్నారు.