ఓపినియన్ పోల్: కేజ్రీవాల్కు 18 సీట్లు, ఢిల్లీలో హంగ్
న్యూఢిల్లీ: సుమారు రెండు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి తగిన మెజార్టీ లభించే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపి) పోటీ చేయడంతో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీకి తగిన మెజార్టీ వచ్చే అవకాశం లేనందున హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయ సేకరణ ద్వారా తెలుస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఏబిపి న్యూస్ ఏసి నీల్సన్ అక్టోబర్ నెలలో అభిప్రాయ సేకరణను నిర్వహించింది. ఢిల్లీ అసెంబ్లీ 70 స్థానాలు కలిగి ఉండగా ఎన్నికల్లో 26శాతం ఓట్లను, 18 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయ సేకరణలో తేలింది. ఇదే అభిప్రాయ సేకరణను ఆగస్టులో నిర్వహించగా 15శాతం ఓట్లు, 8 సీట్లను కేజ్రివాల్ పార్టీ గెలుచుకునే అవకాశాలున్నట్లు ఫలితాలు రావడం గమనార్హం.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని అలంకరించేందుకు అరవింద్ కేజ్రివాల్ 32శాతంతో ముందు ఉండగా.. చెరో 27శాతంతో కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి షిలా దీక్షిత్, భారత జనతా పార్టీ నుంచి విజయ్ గోయల్ తర్వాతి స్థానంలో ఉన్నారు. బిజెపి 34శాతం ఓట్లతో 28 స్థానాలను గెలుచుకుని రాష్ట్రంలో పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ 27శాతం ఓట్లతో 22 స్థానాలకు పరిమితం కానుంది. ఇతరులు 13 శాతం ఓట్లను, 2 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. ఆగస్టులో నిర్వహించిన సేకరణలో 22 శాతం ఓట్లను, 3 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తేలింది.
ఆగస్టులో నిర్వహించిన అభిప్రాయ సేకరణతో పోల్చితే ప్రస్తుతం ఈ రెండు (కాంగ్రెస్, బిజెపి)పార్టీలు కూడా తమ ఓట్ల శాతాన్ని, సీట్లను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో నిర్వహించిన అభిప్రాయ సేకరణ ప్రకారం... బిజెపికి 32 స్థానాలు, కాంగ్రెస్కు 27 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని విషయం వెల్లడైంది. అయితే రెండు సేకరణల మధ్య కాలంలో సుమారు 11శాతం ఆమ్ ఆద్మీ పార్టీ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. కాగా కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో తీవ్ర పోటీ ఇవ్వడంతోపాటు ఆ పార్టీల ఓట్లను, సీట్లను చీల్చే అవకాశం ఉందని పలువురు రాజకీయ నాయకులు భావిస్తున్నారు.