వివాదంలో తమిళనాడు గవర్నర్, అనాధికార పాలన, మౌనంగా సీఎం, మంత్రులు!
చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ అనధికార పాలన ప్రారంభం కావడంతో పలు రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రులు ఉన్న సందర్బంలో ప్రభుత్వ కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మంగళవారం తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కోయంబత్తూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోయంబత్తూరు కలేక్టరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పాలనా వ్యవహారాల సమీక్ష జరిపేందుకు అందరూ రావాలని ముందుగానే అధికారులకు రాజ్ భవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలిసింది.
ఉన్నతాధికారులతో పాటు మంత్రులు వేలుమణి, అన్బళగన్, ఇద్దరు స్థానిక ఎమ్మెల్యేలు గవర్నర్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్బంలో జిల్లాలో ఏఏ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఏ కార్యక్రమాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో నేరుగా తనకే సమాధానం చెప్పాలని గవర్నర్ అధికారులకు సూచించారని తెలిసింది.
ఈ విషయంపై తమిళనాడులో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వం విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోలేదని, అధికారులను మాత్రం పరిచయం చేశామని మంత్రి వేలుమణి వివరణ ఇచ్చారు. గవర్నర్ తీరుపై టీటీవీ దినకరన్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు గవర్నర్ ను అడ్డం పెట్టుకుని పుదుచ్చేరీలో చేస్తున్నట్లు తమిళనాడు రాష్ట్రంలో చెయ్యాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. గవర్నర్ తీరు మీద పలువురు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు.