నోట్ల రద్దు ఎఫెక్ట్: మోడీకి ప్రతిపక్షాలు ఝలక్, 28న భారత్ బంద్
కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడానికి నిరసనగా ప్రతిపక్షాలు కలిసి ఈ నెల 28వ తేదీన భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడానికి నిరసనగా ప్రతిపక్షాలు కలిసి ఈ నెల 28వ తేదీన భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దాదాపు పదమూడు ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఇప్పటికే సభలో మోడీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ అధికార పక్షాన్ని విపక్షాలు ఇరుకున పెడుతున్నాయి.
పెద్ద నోట్ల రద్దుపై ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరింత ఉధృతంగా చేయాలని ప్రతిపక్షాలు తీర్మానం చేశాయి. పెద్ద నోట్ల రద్దు పైన ప్రధానమంత్రి మాట్లాడాలని లోపల, బయట విపరీతంగా డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే.
నాలుగు రోజుల క్రితం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ జంతర్ మంతర్ వద్ద పలు పార్టీలతో కలిసి నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం భారత్ బంద్ పైన ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. సోమవారం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశముంది.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, సీపీఎం, జనతా దళ్, బీఎస్పీ, డీఎంకే, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు భారత్ బందుకు మద్దతుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్లో భారత్ బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశముంది.