బీహార్ ప్రచారంలో మోడీ- ఆర్టికల్ 370 పునరుద్ధరణ అమరవీరులకు అవమానమని వెల్లడి..
హోరాహోరీగా సాగిపోతున్న బీహార్ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ అడుగుపెట్టారు. తొలిరోజు ససారాంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ.. విపక్షాలపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఎక్కడో కశ్మీర్లోని ఆర్టికల్ 370ని బీహార్కు ముడిపెడుతూ ఆయన విపక్షాలను టార్గెట్ చేశారు.
Recommended Video
దేశం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జమ్మూ-కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కానీ ఇప్పుడు యూపీఏ కూటమిలోని విపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. యూపీఏ అధికారంలోకి వస్తే దీన్ని పునరుద్ధరిస్తామని చెబుతున్నారని, ఇది బీహార్ నుంచి అమరవీరులైన జవాన్లకు అవమానంగా మోడీ అభివర్ణించారు. బీహార్ ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉందని, దాన్ని ఎవరూ నిస్సహాయ రాష్ట్రంగా చెప్పలేరన్నారు.
బీహార్లో రోడ్లు, వంతెనల అనుసంధానమే తమ ప్రాధాన్యమని, ఇందుకోసం వేల కిలోమీటర్ల మేర రహదారులను వెడల్పు చేశామని, మిగతా రోడ్లతో వాటిని అనుసంధించామని మోడీ చెప్పుకొచ్చారు. బీహార్లోని నదులపై కడుతున్న అధునాధున వంతెనలే ఇందుకు నిదర్శమన్నారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా విపక్షాలు అన్నింటినీ అడ్డుకుంటున్నాయని మోడీ ఆరోపించారు. తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను అడ్డుకుంటోంది కూడా దళారులే అన్నారు. విపక్షాల భాష కూడా దళారులను మరిపిస్తోందన్నారు.