మన్నార్ మాఫియాపై డీఎంకె ఉద్యమం: స్టాలిన్ వ్యూహమిదే!..
శశికళకు బినామీగా ఉన్న సీఎం పళనిస్వామి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, ఇందుకోసం తలపెట్టనున్న ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని స్టాలిన్ పిలుపునిచ్చారు
చెన్నై: అమ్మ మరణాంతరం అన్నాడీఎంకె రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభాన్ని, ప్రజా వ్యతిరేకతను తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని ప్రతిపక్ష డీఎంకె పార్టీ భావిస్తోంది. అమ్మ మృతిపై సైతం అనుమానాలు లేవనెత్తుతూ అన్నాడీఎంకె రాజకీయాల పట్ల జనంలో ప్రతికూలత ఏర్పడేలా డీఎంకె కార్యాచరణ రూపొందించుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే త్వరలో జిల్లాల స్థాయిలో ఏకంగా ఓ ఉద్యమాన్ని లేవెనెత్తాలని డీఎంకె సన్నాహాలు చేస్తోంది. తమ కార్యాచరణ ద్వారా యువతను, కార్మికులను, ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను తమవైపుకు తిప్పుకోవాలనే యోచనలో డీఎంకె ఉంది.
అక్రమ ఆస్తుల కేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న శశికళకు బినామీగా ఉన్న సీఎం పళనిస్వామి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, ఇందుకోసం తలపెట్టనున్న ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.
మన్నార్ గుడి మాఫియా నుంచి విడిపించేందుకు:
సోమవారం తేనాంపేటలోని డీఎంకె ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తమిళనాడు మన్నార్ గుడి మాఫియా చేతిలో ఇరుక్కుపోయిందని, వారి చేతుల్లోంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ఈ నెల 22న జిల్లా కేంద్రాల్లో నిరహార దీక్షలు నిర్వహించనున్నామని స్టాలిన్ తెలిపారు.
పాలన స్థంభించిపోయింది:
రాష్ట్రంలో గడిచిన తొమ్మిది నెలలుగా పాలన పూర్తిగా స్థంభించిపోయిందని స్టాలిన్ అన్నారు. మాజీ సీఎం జయలలిత ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ప్రభుత్వ పరంగాను, పార్టీ పరంగాను ప్రజా వ్యతిరేక సంఘటనలే చోటు చేసుకుంటున్నాయని స్టాలిన్ ఆరోపించారు.
జయ మృతికి శశికళే కారణం:స్టాలిన్
జయ మృతిపై సామాన్యుల్లో ఇంకా అనుమానాలు నెలకొనే ఉన్నాయని, అధికార పార్టీ వర్గాలు సైతం శశికళ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయని స్టాలిన్ గుర్తుచేశారు.
ఓవైపు జయలలిత కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగానే అన్నాడీఎంకె కార్యాలయంలో పార్టీ శాసనసభ్యుల సమావేశం నిర్వహించారని అన్నారు. పన్నీర్ సెల్వంను శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకోవడం.. అదే సమయంలో పార్టీ కార్యాలయంపై పతాకాన్ని అవనతం చేశారని స్టాలిన్ గుర్తుచేశారు.
అలా చేయడంపై అనుమానం:
పార్టీ కార్యాలయంపై పతాకాన్ని అవనతం చేసిన కాసేపటికే.. జయ బ్రతికున్నారని మళ్లీ జెండా ఎగరవేశారని.. ఈ చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయని స్టాలిన్ అన్నారు. అదీగాక జయలలిత మృతికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువకుండానే పన్నీర్ సెల్వం సీఎం కావడం, రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయడం పూర్తయిపోయాయని గుర్తుచేశారు.
ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటిని ఉటంకిస్తూ అన్నాడీఎంకె పాలిటిక్స్ పై స్టాలిన్ విమర్శలు గుప్పించారు. కుట్రపూరితంగా పన్నీర్ సెల్వంను రెండు మాసాలకే సీఎం పదవి నుంచి దించేశారని అన్నారు.
కోలుకుంటున్న కరుణానిధి:
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎంకె అధ్యక్షుడు కరుణానిధి ఇంటి వద్ద కోలుకుంటున్నారని, ప్రస్తుతం వైద్యులు ఆయనకు స్పీచ్ థెరపీ అందిస్తున్నారని స్టాలిన్ తెలిపారు.
వృద్ధాప్యం వల్లే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ట్రక్యోస్టమీ సమస్య వల్ల మాట్లాడలేకపోతున్నారని స్టాలిన్ వివరించారు. మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని, త్వరలో ఆయన కోలుకుంటారని వైద్యులు చెబుతున్నట్లుగా స్టాలిన్ పేర్కొన్నారు.