మీకు కళ్లు లేవా? చెవులు లేవా? ఎన్నికల సంఘానికి చీవాట్లు: మోడీ కేదార్నాథ్ ట్రిప్పై దుమారం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒంటినిండా కాషాయ శాలువా ఒకటి కప్పుకొని, ఏదో గుహలో ధ్యానంలో ఉన్న ఫొటో ఒకటి ఆదివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత, అతి ప్రాచీన కేదార్నాథ్ ఆలయ సందర్శనకు వెళ్లిన మోడీ.. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్న ఓ గుహలో ధ్యాన నిమగ్నుడై ఉన్న ఫొటో అది. ఇప్పుడా పిక్.. విమర్శలకు కేంద్రబిందువైంది. ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ.. ఆయన మాత్రం ఇంకా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారంటూ విమర్శిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి.
ప్రత్యేకించి- పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈ అంశంపై రచ్చ చేస్తోంది. కేదార్నాథ్ సమీపంలోని ఓ గుహలో మోడీ ధ్యానం చేస్తోన్న ఫొటోలను ఉత్తరాఖండ్ బీజేపీ నాయకులు ట్వీట్ చేశారు. పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే అవి వైరల్గా మారాయి.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైనప్పటికీ.. మోడీ మాత్రం దీన్ని కొనసాగిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మోడీ కేదార్నాథ్ మందిరాన్ని సందర్శించడం, అక్కడి గుహల్లో ధ్యానంలో కూర్చోవడం వంటి అంశాలు అన్ని ఛానళ్లలోనూ విస్తృతంగా ప్రసారం అయ్యాయని, అవి ఓటర్లను ప్రభావితం చేస్తాయని తృణమూల్ సీనియర్ నాయకుడు డెరెక్ ఒబ్రియన్ ఆరోపిస్తున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ తతంగం అంతా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొన్నారు. కేదార్నాథ్ ఆలయం అభివృద్ధి కోసం మోడీ మాస్టర్ ప్లాన్ను ప్రకటించారని, ఇది కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందా? రాదా? అని ప్రశ్నించారు.
దీనిపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు లేఖ రాశారు. కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో స్థానికులు, భక్తులను ఉద్దేశించి మోడీ ప్రసంగించడం కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా.. స్థానికులు మోడీ, మోడీ అంటూ నినదించారని, ఎన్నికల నియమావళికి ఇది విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి కళ్లు, చెవులుగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం.. గుడ్డి, చెవిటివాళ్లలాగా ప్రవర్తిస్తోందని ఆమె ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చీవాట్లు పెట్టారు. మోడీ చెప్పు చేతల్లో పనిచేయొద్దని హితవు పలికారు.
अहम् और अहंकार त्याग कर ही सच्चे भक्त जाते है बाबा के द्वार,
— Randeep Singh Surjewala (@rssurjewala) May 18, 2019
लाल कालीन बिछवाकर कर नहीं !
मोदी जी,
कम से कम इतना तो जानते ही होंगे आप ! pic.twitter.com/J0RrPasfcp
మరోవంక- రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా దీనిపై స్పందించారు. నిండుగా కాషాయ శాలువాను కప్పుకొని, ధ్యానం చేస్తున్నట్లు మోడీ నటిస్తున్నారని, తుది దశ పోలింగ్ సరళిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికే ఆయన ఈ ఎత్తుగడ వేశారని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల ఆయన దేశ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారనేది అర్థం కావట్లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలా సైతం మోడీ చర్యలను తప్పుపట్టారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఓ రాజకీయ నాయకుడికి ఎర్ర తివాచీ ద్వారా ఎలా స్వాగతం పలుకుతారని ఆయన ప్రశ్నించారు. నిజమైన భక్తుడు ఎవరైనా సరే.. ఆలయానికి వెళ్లేటప్పుడు తన అహంభావాన్ని, రాగధ్వేషాలను పక్కన పెడతారని, మోడీలో అవన్నీ నిండుగా కనిపించాయని ఆయన చురకలు అంటించారు.