సీబీఐ ఇష్యూ: పవార్ ఇంట్లో విపక్షాల భేటీ, చంద్రబాబును అడిగాక నిర్ణయం... మమతా బెనర్జీ
న్యూఢిల్లీ: ఎన్డీయేను వ్యతిరేకించే పక్షాలు ఢిల్లీలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ అయ్యారు. బీజేపీతో పోరు, అలాగే కేంద్ర ప్రభుత్వం సీబీఐ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లోకి అమిత్ షాను, యోగి అదిత్యానాథ్ను మమతా బెనర్జీ అనుమతించలేదు. బీజేపీ రథయాత్రకు నో చెప్పారు. అదే సమయంలో శారదా స్కాంలో కోల్కతా సీపీ రాజీవ్ కుమార్ను సీబీఐ విచారణకు ఆహ్వానించడం, దీదీ రచ్చ కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విపక్ష నేతలు ఢిల్లీలో పవార్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, టీఎంసీ ఎంపీ డెరెక్ ఒ బ్రెయిన్ తదితరులు ఉన్నారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, ఏఏపీ నేత సంజయ్ సింగ్లు కూడా ఉన్నారు.
మమతా బెనర్జీకి అండగా ఉంటాం
సమావేశం అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ... వ్యవసాయం, నిరుద్యోగం తదితర అంశాలు తమ అజెండా అని చెప్పారు. సీబీఐ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము మరోసారి కలుస్తామని చెప్పారు. నిన్న కోల్కతాలో ఏం జరిగిందో అందరూ చూశారని చెప్పారు. రేపు లేదా ఎల్లుండి ఈ అంశంపై కూడా చర్చిస్తామని చెప్పారు. కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటాయని చెప్పారు. ఈ విషయంలో మమతా బెనర్జీకి తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ రోజు మమతా బెనర్జీకి జరిగింది, ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగిందని చెప్పారు. కేజ్రీవాల్ కార్యాలయం, అధికారుల కార్యాలయాల్లోను ఇలాగే జరిగిందని చెప్పారు. సీబీఐ తీరును ఖండిస్తున్నామన్నారు.
మమతా బెనర్జీకి చుక్కెదురు
కాగా, సీబీఐతో వివాదం విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సీబీఐ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరైతే వచ్చిన ఇబ్బంది ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. సీపీ విచారణకు సహకరిస్తే అరెస్ట్ చేయవద్దని కూడా సీబీఐకి సూచించింది.
బెంగాల్ సిట్ సరిగా దర్యాఫ్తు చేయలేదని అపిడవిట్
మమతా బెనర్జీ కూడా విచారణకు రావాలని ఏజీ సంకేతాలు ఇచ్చారు. దీనిపై ఏజీ తన వాదనలు వినిపిస్తూ.. శారదా చిట్ కుంభకోణంలో బెంగాల్ సిట్ సరిగా దర్యాఫ్తు చేయలేదని చెప్పారు. సీబీఐకి సమర్పించిన సిట్ నివేదిక తప్పుల తడకగా ఉందని చెప్పారు. శారదా చిట్ ఫండ్స్ స్కాంలో ఆధారాలు మాయం చేశారని, మార్చారని సిబిఐ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేశారు. సిట్ సేకరించిన ఆధారాలు, ఫైల్స్ సీబీఐకి ఇవ్వడం లేదని ఏజీ కేకే వేణుగోపాల్... సుప్రీం కోర్టుకు తెలిపారు. పశ్చిమ బెంగాల్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్కు చీఫ్గా సీపీ రాజీవ్ కుమార్ ఉన్నారని చెప్పారు. ఆధారాలపై అనేకసార్లు కోరినా రాజీవ్ కుమార్ స్పందించలేదని కోర్టుకు తెలిపారు. శారదా చిట్ స్కాంలో బెంగాల్ సిట్ సరిగా దర్యాఫ్తు చేయలేదని తెలిపారు. సీబీఐకి సమర్పించిన సిట్ నివేదిక తప్పుల తడకగా ఉందని చెప్పారు.
చంద్రబాబుతో మాట్లాడాక దీక్షపై నిర్ణయం
సుప్రీం కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ కూడా స్పందించారు. అత్యున్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు అని, కోర్టు తీర్పు ప్రజావిజయం అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అధికారుల్లో నైతిక స్థైర్యం నింపిందని చెప్పారు. సీబీఐ దర్యాఫ్తును తాము ఎప్పుడూ అడ్డుకోలేదని చెప్పారు. సీబీఐ వ్యవహరించిన తీరు మాత్రమే అభ్యంతరకరమన్నారు. సీబీఐ తీరు రాజకీయ కక్ష సాధింపు మాత్రమే అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించలేదన్నారు. మోడీ, అమిత్ షాల ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారారని చెప్పారు. తమ యుద్ధం మోడీ పైనే అన్నారు. తన దీక్ష గురించి మాట్లాడుతూ... చంద్రబాబు, నవీన్ పట్నాయక్లతో మాట్లాడిన తర్వాత దీక్ష విరమణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.