సీఏఏపై కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల సమావేశం: దీదీ, బెహెన్జీ, స్టాలిన్ డుమ్మా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విపక్షాలు ఈ అంశాలపై సమావేశం నిర్వహించి దేశంలోని రాజకీయ పరిస్థితులపై సమీక్షించాయి. ఈ సమావేశంలో చర్చించి వ్యూహాలను సిద్ధం చేశాయి.
సమావేశానికి ప్రధాన పార్టీలు డుమ్మా
కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం ద్వారా విపక్షాలు అన్నీ ఒక్క వేదికపైకి వచ్చి ప్రభుత్వానికి గట్టి సంకేతాలు పంపాలని భావించినప్పటికీ 6 ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు డుమ్మా కొట్టడంతో విఫలమైంది. సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిలు దూరంగా ఉన్నారు.
ఇక కాంగ్రెస్ ప్రధాన మిత్రపక్షం డీఎంకే అధినేత స్టాలిన్ కూడా సమావేశానికి డుమ్మా కొట్టారు. అయితే తమిళనాడులో డీఎంకే పార్టీ పట్ల కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసినందునే స్టాలిన్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన సమావేశానికి గైర్హాజరయ్యారని తెలుస్తోంది. మరోవైపు వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆమ్ఆద్మీ పార్టీ కూడా హాజరు కాకూడదని నిర్ణయించుకుంది.
శివసేన ఎందుకు హాజరుకాలేదు..?
మరోవైపు మహారాష్ట్రలో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో పలు అనుమానాలు తెరపైకొచ్చాయి. అయితే సమావేశానికి హాజరుకావాల్సిందిగా అధికారికంంగా ఆహ్వానం పలకలేదని చెప్పుకొచ్చింది. అయితే మహారాష్ట్రలో మాత్రం పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయమని శివసేన స్పష్టం చేసింది. ఇక జనవరి 8వ తేదీన భారత్ బంద్ జరుగగా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు హింసకు పాల్పడ్డారని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ... ఈ సమావేశానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు డబుల్ గేమ్ ఆడుతున్నాయని ఎట్టి పరిస్థితుల్లో వాటిని ప్రోత్సహించేదిలేదని మమతా తేల్చి చెప్పారు.
సమావేశాన్ని బహిష్కరించిన మాయావతి
కాంగ్రెస్తో బేధాభిప్రాయాలు ఉన్న క్రమంలో ఆ పార్టీ నేతృత్వంలో జరిగే సమావేశానికి బీఎస్పీ నుంచి ఎవరూ హాజరు కారని ఆ పార్టీ అధినేత్రి మాయావతి చెప్పారు. ఆ తర్వాత కొద్ది సేపటికి రాజస్థాన్లోని బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కొనుగోలు చేసినందున సీఏఏ సమావేశంను బీఎస్పీ నిషేధిస్తున్నట్లు బెహెన్జీ ట్వీట్ చేశారు. రాజస్థాన్లోని ఆరుమంది బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
విపక్షాల సమావేశానికి హాజరైంది వీరే
మరోవైపు సమావేశానికి హాజరైన వారిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరి, రాజా, జేఎంఎం నేత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎల్జేడీ చీఫ్ శరద్ యాదవ్, రాష్ట్రీయ లోక్సమతా పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత హస్నేన్ మసూదిలతో పాటు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లు హాజరయ్యారు.