శరద్ పవార్ ఇంట్లో బీజేపీయేతర అగ్రనాయకుల భేటీ... ఎలాంటి చర్చలు జరిపారు..?
16వలోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత కొద్ది గంటలకే బీజేపీయేతర నేతలు ఆరుగురు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో భేటీ అయ్యారు. ఎన్నికలకంటే ముందే కూటమి ఏర్పాటుపై చర్చించారు. అంతా కామన్ మినిమమ్ ప్రోగ్రాంపైనే ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అగ్రనాయకులు ఏమి చర్చించారు... బలమైన బీజేపీని ఢీకొట్టేందుకు ఎలాంటి వ్యూహాలు రచించారు?
సబ్కో ఏక్ రఖో...దేశ్కో బచావో నినాదం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశరాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీయేతర నాయకులంతా ఒక్క తాటిపైకొస్తున్నారు. దీంతో రాజకీయాలు ఆసక్తి కలుగుతున్నాయి. బుధవారం చివరి పార్లమెంటు సమావేశాలు ముగిశాక అగ్రనాయకులంతా శరద్ పవార్ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. " సబ్కో ఏక్ రఖో, దేశ్ కో బచావో అనేది మా నినాదం. దేశాన్ని బీజేపీ, మోడీ, అమిత్ షాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మోడీ హఠావో దేశ్ బచావో నినాదంతో ముందుకు వెళుతున్నాం. ఇందుకోసం ముందస్తుగానే కూటమిని ఏర్పాటు చేస్తాం. ఎన్నికల తర్వాత కూటమి ఆలోచన వర్కవుట్ కాదు. కామన్ మినిమన్ ప్రోగ్రాం ఆలోచనపై ఒక ఒప్పందం చేసుకుంటాం. దీని గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చూస్తారు"అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.
సమావేశానికి కొందరు నేతలు డుమ్మా
అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నా తర్వాత విపక్ష నేతలంతా శరద్ పవార్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కేజ్రీవాల్ దీక్షకు కొందరు ఎస్పీ, కమ్యూనిస్టులు, ఆర్జేడీ నేతలు కలిసి మద్దతు తెలిపినప్పటికీ...శరద్ పవార్ ఏర్పాటు చేసిన కీలక భేటీకి మాత్రం హాజరుకాలేదు. అయితే బీఎస్పీతో ఎస్పీ పొత్తు పెట్టుకున్న కారణంగా ఈ విపక్ష కూటమిపై వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీయేతర నేతలు సమావేశమైన ప్రతిసారి కమలం పార్టీ వీరిపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ కూటమి సొంత ప్రయోజనాలకోసమే ఏర్పడుతోందని వారికి భవిష్యత్తుపై ఒక విజన్ లేదని ఆరోపిస్తోంది.
రాష్ట్రంలో విబేధాలు...దేశ ప్రయోజనాల కోసమే...
రాష్ట్ర పరిధిలో తమకు మరొక పార్టీతో విబేధాలు ఉండొచ్చు కానీ..దేశ ప్రయోజనాల దృష్ట్యా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరముందని సమావేశానికి హాజరైన ఓ అగ్రనేత తెలిపారు. తమలో తమకు విబేధాలు ఉన్నాయన్న మాటలను ఆయన కొట్టిపారేశారు. నరేంద్ర మోడీ విచారణ సంస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. కామన్ మినిమన్ ప్రోగ్రాం గురించి చర్చించేందుకు మరొకసారి సమావేశమవుతామని రాహుల్ గాంధీ తెలిపారు. బీజేపీని ఓడించేందుకు అందరం కలిసి పనిచేస్తామనే ఒప్పందానికి వచ్చామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఈ సమావేశం శరద్ పవార్ ఇంట్లోనే జరిగినా... సమావేశం కావాలని ఇచ్చిన ఐడియా మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుదే అని తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి తయారు చేయడంలో చంద్రబాబు పనిచేస్తున్న సంగతి తెలిసిందే.