సాయంత్రం రాష్ట్రపతితో విపక్ష ఎంపీల భేటీ- ఐదుగురికే ఛాన్స్- కాంగ్రెస్ విమర్శల నేపథ్యం..
పార్లమెంటులో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన విపక్ష ఎంపీలు ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీకి సిద్ధమవుతున్నారు. వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలను రాష్ట్రపతికి వివరించనున్నారు.
రాష్ట్రపతిపై కాంగ్రెస్ విమర్శలు - వ్యవసాయ బిల్లులపై పోరు ముమ్మరం - తిరిగొచ్చిన సోనియా, రాహుల్
రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుకున్న ఎనిమిది మంది విపక్ష ఎంపీలను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అనుచిత ప్రవర్తన పేరుతో సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయంపై ఆగ్రహంతో ఎంపీలు పార్లమెంటు లాన్లోనే ఆదివారం రాత్రంతా నిరసన చేపట్టారు. ఉదయాన్నే వారికి టీ తీసుకెళ్లి ఇచ్చిన డిప్యూటీ ఛైర్మన్.. ఈ మంత్రాంగం ఫలించకపోవడంతో స్వయంగా ఒక్కరోజు నిరాహారదీక్షకు దిగారు. దీనికి కౌంటర్గా ఎన్సీపీ నేత శరద్పవార్ విపక్ష ఎంపీల తరఫున నిరాహారదీక్ష చేశారు.
ఇంత జరుగుతున్నా రాష్ట్రపతి కోవింద్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. ఇవి కాస్తా చర్చనీయాంశం కావడంతో విపక్ష ఎంపీలకు రాష్ట్రపతి కోవింద్ ఇవాళ సాయంత్రం అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఐదుగురు విపక్ష పార్టీల నేతలకు మాత్రమే ఆయన అపాయింట్మెంట్ లభించింది. రాజ్యసభలో ప్రవర్తనపై ఎంపీలు క్షమాపణ చెబితే సస్పెన్షన్ వెనక్కి తీసుకుంటామని కేంద్రం చెబుతుండగా.. మూడు డిమాండ్లు నెరవేరే వరకూ వెనక్కి తగ్గబోమని విపక్షం స్పష్టం చేస్తోంది.