ఎలెక్షన్ స్కెచ్: 2019 ఎన్నికల కోసమే బీజేపీ పీడీపీతో తెగదెంపులు చేసుకుంది
జమ్ము కశ్మీర్ : జమ్ముకశ్మీర్లోని మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన బీజేపీ నిర్ణయంపై విపక్ష పార్టీ కాంగ్రెస్ మండిపడింది. 2019 సాధారణ ఎన్నికల కోసమే బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది.
పీడీపీకి మద్దతు ఉపసంహరించోవాలని ప్రకటించిన బీజేపీ నిర్ణయంపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీపీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ మూడేళ్లకే తెగదెంపులు చేసుకొని బీజేపీ రాజకీయ అనైతికతకు పాల్పడిందని ట్విటర్లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్. మరోవైపు పీడీపీతో కలిసి తాము ప్రభుత్వ ఏర్పాటు చేయబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంపై శివసేన రియాక్ట్ అయ్యింది. అసలు పీడీపీతో బీజేపీ జతకట్టడం చారిత్రక తప్పిదమని ఈ బంధం ఎంతో కాలం నిలవదని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే అప్పుడే జోస్యం చెప్పారని శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ గుర్తు చేశారు. పదవులన్నీ అనుభవించాక బీజేపీ తెగదెంపులు చేసుకుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
2015లో జమ్ము కశ్మీర్కు జరిగిన ఎన్నికల్లో హంగ్ రావడంతో బీజేపీ సహాయంతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత క్రమంలో రెండు పార్టీల మధ్య పలు అంశాలపై పొరపచ్చాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో కతువాలో చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటనలో బీజేపీ మంత్రులు నిందితులను కాపాడే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. తర్వాత రంజాన్ మాసం సందర్భంగా కాల్పుల విరమణ, ఉగ్రవాదుల కోసం వేట ఆగవని కేంద్రం ప్రకటనతో ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు.