వ్యవసాయ బిల్లులు: మరో ట్విస్ట్ - మూజువాణి ఓటు కూడా చేపట్టలేదన్న ఆజాద్ -సంతకం వద్దని రాష్ట్రపతి వినతి
వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు సంబంధించి మరో కీలక అంశాన్ని విపక్షాలు బయటపెట్టాయి. రాజ్యసభలో ఎన్డీఏకు మెజార్టీ లేకపోయినా, విపక్షాలు డివిజన్ ఓటింగ్ కోరినా ఖాతరు చేయకుండా, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్.. మూజువాణి ఓటు ద్వారా బిల్లులు పాస్ అయినట్లు ప్రకటించినట్లు ఇప్పటిదాకా చెప్పుకొచ్చిన ప్రతిపక్ష పార్టీలు.. అసలు మూజువాణి ప్రక్రియను సైతం చేపట్టకుండానే ప్రభుత్వం బిల్లుల్ని ఆమోదింపజేసుకుందని సంచలన ఆరోపణలు చేశాయి.
చైనా వైరస్ వల్లే సర్వనాశనం - డ్రాగన్పై చర్యలకు ట్రంప్ డిమాండ్ - ఐరాసలో స్పీచ్ - WHOపైనా ఫైర్
రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల భేటీ..
రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిశారు. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలకు వివరించి, సదరు బిల్లులపై సంతకాలు చేయొద్దని రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లినవారిలో కాంగ్రస్ సహా డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆప్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీల నేతలున్నారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆజాద్ మీడియాతో మాట్లాడారు.
మూజు వాణి ఓటు కూడా లేదు..
‘‘వ్యవసాయ బిల్లులు తీసుకురావడానికి ముందు ప్రభుత్వం అన్ని పార్టీలు, రైతు నేతలతో చర్చించాల్సి ఉండేది. కానీ అలా చేయలేదు. రాజ్యసభలో డివిజన్ ఆఫ్ ఓట్స్ కోసం ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టారు. డివిజన్ ఓటు లేదు, కనీసం మూజువాణి ఓటూ లేదు. తప్పుడు పద్ధతుల్లో బిల్లుల్ని పాస్ చేయించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య దేవాలయంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. ఇదే విషయాన్ని మేము రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సంతకాలు చేయొద్దని కోరాం. ఈ బిల్లులను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి'' అని ఆజాద్ పేర్కొన్నారు.
ఫటాఫట్ బిల్లుల ఆమోదం..
వ్యవసాయ బిల్లుల ఆమోదం రాజ్యాంగ విరుద్ధమని, దానిని అడ్డుకున్న ఎంపీలపై సస్పెన్షన్ వేటు అక్రమమని వాదిస్తోన్న ప్రతిపక్ష పార్టీలు.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను బహిష్కరించడం తెలిసిందే. రాజ్యసభలో విపక్షం లేని వేళ.. ప్రభుత్వం ఏకంగా 15 కీలక బిల్లుల్ని అమోదింపజేసుకుంది. జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లు-2020ను రాజ్యసభలో బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ బిల్లుతో కశ్మీరీ, డోగ్రి, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూలకు జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో అధికార భాషల హోదా లభించినట్టయింది. విపక్షాలు బాయికాట్ చేసిన మంగళవారం 3.5 గంటల్లోనే ఏకంగా 7 బిల్లుల్ని రాజ్యసభ ఆమోదించింది. బుధవారం మరో 7 కీలక బిల్లుల్ని పాస్ చేసింది.
తిరుమల: మంత్రి కొడాలి నాని బిగ్ బాంబ్ - మోదీని భార్యతో వెళ్లమనండి - వీర్రాజుకు పదవి తర్వాతే దాడులు
100.69% ప్రొడక్టివిటీ సాధించామన్న వెంకయ్య..
రాజ్యసభలో అనూహ్య పరిణామాలు, విపక్షాల బాయికాట్ నేపథ్యంలో చైర్మన్ వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నియమ, నిబంధలనకు అనుగుణంగా రాజ్యసభను నడుపుతూ, సభా గౌరవాన్ని కాపాడటం తన ధర్మమని, ఎంపీలపై సస్పెన్షన్ విధింపు బాధాకరమే అయినా రూల్స్ ప్రకారం తప్పలేదని చెప్పారు. గడిచిన పదిరోజుల్లో 25 బిల్లులు ఆమోదం పొందగా.. ఆరు బిల్లులను కొత్తగా ప్రవేశపెట్టారని, మొత్తంగా సభ 100.69% ప్రొడక్టివిటీ సాధించిందని, ఎంపీలు అడిగిన 1,567 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు అందాయని, సభ్యులు 92 జీరో అవర్, 66 స్పెషల్ మెన్షన్ తీర్మానాల ద్వారా ఎంపీలు వివిధ అంశాలను లేవనెత్తారని చైర్మన్ వెల్లడించారు.