ఈవీఎంలపై ఈసీని కలిసిన ప్రతిపక్షాలు: 50శాతం లెక్కించాలని ఆజాద్, బ్యాలెట్ కావాలని చంద్రబాబు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో విపక్షాలు సమావేశమయ్యాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వారు సీఈవోతో భేటీ అయ్యారు. ఈవీఎంల లోపాలపై తయారు చేసిన నివేదికను వారు ఈసీకి అందించారు. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని లేదంటే వీవీప్యాట్లు లెక్కించాలని కోరారు.
అనంతరం గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. ఈవీఎం లోపాలపై నివేదికను ఈసీకి అందించామని చెప్పారు. ఈవీఎంల అవకతవకలపై ఈసీకి వివరించామని చెప్పారు. ఈవీఎంలలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకి వెళ్తుందని చెప్పారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయన్నారు. ఈవీఎంల అవకతవకలపై విపక్షాల పార్టీల భేటీలో చర్చించామన్నారు. పోలైన ఓట్లలో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలన్నారు. వీవీప్యాట్ స్లిప్పులను ఈసీ సురక్షితంగా ఉంచాలన్నారు. ఈవీఎంలలో మరింత పారద్శకత రావాల్సి ఉందని చెప్పారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ఈవీఎంలపై ఇప్పటికే చాలాసార్లు అనుమానం వ్యక్తం చేశామని చెప్పారు. ఇప్పటికైనా పేపర్ బ్యాలెట్ అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం బతకాలంటే పేపర్ బ్యాలెట్ అమలులోకి తీసుకు రావాలన్నారు. 23 పార్టీల ప్రతినిధులం కలిసి ఎన్నికల సంఘాన్ని కలిశామని చెప్పారు. సాంకేతికంగా ముందున్న దేశాలు కూడా బ్యాలెట్ పద్ధతిని పాటిస్తున్నాయని చెప్పారు. పోలైన ఓట్లలో ఒక్క శాతం మాత్రమే లెక్కిస్తున్నారన్నారు. ఈవీఎంల అవకతవకలపై ప్రజలకు విశ్వాసం కల్పిస్తామని అన్నారు. ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం తమకు ఉందని చెప్పారు.