రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్పై విపక్షాల అవిశ్వాస తీర్మానం: సభ్యుల అనుచిత ప్రవర్తనపై చర్యలు?
న్యూఢిల్లీ: రాజ్యసభలో రైతు, వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణపై 12 ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, తదితర పార్టీలు ఈ నోటీసును ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ తెలిపారు.
రైతు, వ్యవసాయ విధానాలపై ఆదివారం సభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నోటీసు ఇచ్చామన్నారు. ఇదో చీకటి రోజు అని అహ్మద్ పటేల్ అన్నారు. లోక్సభ ఆమోదం పొందిన 'ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీసు' బిల్లులు ఆదివారం రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
విపక్షాల తీవ్ర అభ్యంతరాలు, నిరసనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు. అయితే, సభ్యులు ఓటింగ్ జరపాలని కోరినప్పటికీ డిప్యూటీ ఛైర్మన్ తిరస్కరించడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్య సప్రదాయాలకు డిప్యూటీ ఛైర్మన్ తూట్లు పొడిచారని ఆరోపించాయి.
బిల్లులకు వ్యతిరేకగా నిరసనలు జరుగుతున్న సమయంలో సభను రేపటికి వాయిదా వేయాలని కోరినప్పటికీ.. డిప్యూటీ ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించి బిల్లుల ఆమోదానికి సహకరించారని ధ్వజమెత్తాయి. సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం ఓటింగ్ నిర్వహించాలని కోరినప్పటికీ ఆయన వినిపిచుకోలేదని అహ్మద్ పటేల్ తెలిపారు.
Recommended Video
ఇది ఇలావుంటే, వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా వివక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులో పోడియం వద్దకు దూసుకువచ్చి నిరసనలు, ఆందోళనలు చేయడం, డిప్యూటీ ఛైర్మన్ మైక్ లాగేందుకు ప్రయత్నించడం, బిల్లు ప్రతులను చించివేయడం వంటి ఘటనలపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అనుచితంగా ప్రవర్తిచిన సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.