యడ్యూరప్ప వ్యాఖ్యలపై ప్రతిపక్షాలే కాదు సొంత పార్టీలోనూ విమర్శల వెల్లువ .. సెల్ఫ్ డిఫెన్స్ లో బీజేపీ
కర్ణాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు సొంత పార్టీ నేతలు సైతం యడ్డీ వ్యాఖ్యలను విభేదిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ మొదలైంది.
బీజేపీ రాజకీయాలకు 132 కోట్ల దేశ ప్రజలు దొరికారా .. రణదీప్ సింగ్ సుర్జేవాలా
బిజెపి నాయకులు రాజకీయాలు చేయడానికి 132 కోట్ల దేశ ప్రజల దొరికారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఈ వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు .యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. దేశ రక్షణ కోసం సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ఈ పోరాటాన్ని ఎన్నికల రాజకీయాలకు వాడుకోవటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది.పాకిస్థాన్లో ఉగ్రవాదుల శిబిరాలపై భారతదేశం చేసిన దాడుల కారణంగా భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారన్న వ్యాఖ్యలపై 132 కోట్ల భారతీయులపై ఇన్ని రాజకీయాలా ? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
యడ్యూరప్పతో విభేదించిన సొంత పార్టీ నేత .. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికె సింగ్
యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేత, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ సైతం విభేదించారు. దేశం చేస్తున్న పోరాటం దేశ రక్షణ కోసం అని యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వ ఎజెండా ఎన్నికల్లో సీట్లు గెలవడం కాదని ఆయన అన్నారు. మన ప్రభుత్వం తీసుకున్న చర్య దేశాన్ని కాపాడటం కోసం మరియు దేశ ప్రజలను కాపాడడం కోసమేనని చెప్పిన వీకే సింగ్ మనమంతా ఏకతాటి మీద నిలబడాలని ఆయన అన్నారు. కేవలం ఎన్నికలలో అదనపు సీట్లను గెలవడమే తమ లక్ష్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.
సర్జికల్ స్ట్రైక్ తో ఎన్ని అదనపు సీట్లు వస్తాయనే లెక్కలో యడ్యూరప్ప .. కర్ణాటక సీఎం కుమారస్వామి
జేడీఎస్ నేత కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి సైతం యడ్యూరప్ప వ్యాఖ్యలపై తన స్పందన తెలియజేశారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, భారత సైన్యం చూపిస్తున్న ధైర్యాన్ని సమర్థించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత సాయుధ దళాల మద్దతును సీఎం కుమారస్వామి మెచ్చుకున్నారు. అయితే యడ్యూరప్ప చేసిన ప్రకటనపై మాత్రం కుమారస్వామి సైతం తన వ్యాఖ్యలతో చెంప చెళ్ళుమనిపించారు. దేశం మొత్తం ఏక తాటి మీదికి వచ్చి టెర్రరిజం పైన పోరాటం చేస్తున్న ఇండియన్ ఆర్మీ ని, కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తుంటే, బిజెపి సీనియర్ నాయకులు యడ్యూరప్ప మాత్రం లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని అదనపు సీట్లు గెలుచుకుంటామనే అంశంపైన బిజీగా ఉన్నారని కుమారస్వామి మండిపడ్డారు. ఉవ్రవాదుల పైన దాడులు, పాకిస్థాన్ తో యుద్ధం ఆ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో సీట్లు తీసుకు వస్తాయి అని చెప్పడం సిగ్గుచేటని కుమారస్వామి పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మన సాయుధ దళాల త్యాగాన్ని బలి చేయడం సిగ్గుచేటని చాలా ఘాటుగా స్పందించారు కర్ణాటకముఖ్యమంత్రి కుమారస్వామి .
అన్ని పార్టీల నుండి విమర్శల వర్షం .. సెల్ఫ్ డిఫెన్స్ లో బీజేపీ
ప్రతిపక్ష పార్టీల నేతలే కాకుండా, బిజెపి లో ఉన్న నేతలు, మంత్రులు సైతం యడ్యూరప్ప వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశం కోసం జరుగుతున్న పోరాటాన్ని, ఎన్నికల కోసం చేస్తున్న ఎత్తుగడ లాగా యడ్యూరప్ప మాట్లాడి బిజెపి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారు. ఒకపక్క భారత్ పాక్ బోర్డర్లో సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే మరోపక్క రానున్న ఎన్నికలకు ప్రస్తుతం జరుగుతున్న పోరాటం ఉపకరిస్తుందని యడ్యూరప్ప మాట్లాడడాన్ని దేశం మొత్తం వ్యతిరేకిస్తోంది. సైన్యం ప్రాణాలతో అడగటం యడ్యూరప్పకు ఎన్నికల రాజకీయమంటూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొత్తానికి వివాదాస్పద వ్యాఖ్యలతో అటు యడ్యూరప్ప, ఇటు బిజెపి ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది.