కొనసాగుతున్న విపక్షాల ఆందోళన: లోకసభ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ: మూడో రోజు కూడా పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభంనుంచి ఆందోళన చేయడంతో ఉదయ సభలు మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడ్డాయి. అనంతరం ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఆందోళనలు కొనసాగడంతో మరోసారి రాజ్యసభ వాయిదాపడింది.
కాగా, విపక్షాల ఆందోళనలు కొనసాగుతుండగానే లోకసభలో ప్రశ్నోత్తరాలు సాగుతున్నాయి. ఏపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయమై ప్రశ్నించారు. ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ సభకు హాజరుకావాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ అజాద్ క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేసింది. ప్రశ్నోత్తరాలకు విపక్షాల ఆందోళనలతో అడ్డుతగలడంతో స్పీకర్ లోకసభను సోమవారానికి వాయిదా వేశారు.
గురువారం తాజా పరిణామాలను ఉరీ ఉగ్రవాద దాడితో పోలుస్తూ రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్య పెద్ద రగడకు కారణమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారపక్షం ఆజాద్ క్షమాపణకు పట్టుపడుతోంది.
కాగా, ఆందోళనల కారణంగా రాజ్యసభను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేశారు.