రాజ్యసభలో రాందేవ్ 'పుత్రజీవక్ బీజ్' ప్యాకెట్ రచ్చ: మగపిల్లలు పుడతారని తప్పుడు ప్రచారం..!
న్యూఢిల్లీ: యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ తయారు చేస్తోన్న ఆయుర్వేద మెడిసిన్స్ను నిషేధించాల్సిందిగా రాజ్యసభలో ప్రతిపక్షాలు కోరాయి. ఈ మెడిసిన ఉపయోగించే వారికి మగ సంతానం కలుగుతుందని తయారీదారులు ప్రకటించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.
గురువారం సభ ప్రారంభం కాగానే జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన ఎంపీ కేసీ త్యాగి సభలోకి 'పుత్రజీవక్ బీజ్' అనే ఆయుర్వేద మెడిసిన్ ప్యాకెట్ను తీసుకొచ్చారు. ఈ ప్యాకెట్ను ప్రదర్శిస్తూ, ఈ ప్యాకెట్ను తాను దివ్యా ఫార్మసీ షాపులో తెచ్చానని, మగపిల్లలు పుడతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఏప్రిల్ 14న తాను దీనిని తీసుకొన్నట్లు రశీదును కూడా సభలో ప్రదర్శించారు. హర్యానా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ 'పుత్రజీవక్ బీజ్' అనే ఆయుర్వేద మెడిసిన్ను అందిస్తోంది. దీనిని వాడిన వారికి మగ సంతానం కలుగుతోందని ప్రచారం చేస్తోంది.
ఇలా తప్పుడు ప్రచారం కల్పించడం చట్ట విరుద్ధం, రాజ్యాంగేతరమైన చర్యగా పేర్కొంటూ దానిని వెంటనే నిషేధించి, దివ్యా ఫార్మసీ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాందేవ్ పేరుని ప్రస్తావించకుండా నిజంగా దేశాన్ని ఒక డైనమిక్ లీడరైన నరేంద్రమోడీ పరిపాలిస్తుంటే, ఆయన రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల ఆందోళనల తర్వాత సమాజ్ వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఆ ప్యాకెట్ను తీసుకెళ్లి ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు ఇచ్చారు. మరికొంత మంది ప్రతిపక్ష సభ్యులు అలాంటి ఉత్పత్తులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం లింగ నిష్పత్తిపై సీరియస్గా ఉందని చెప్పారు. బాలికలకు సాధికారితను కాపాడేందుకు ప్రధాని నరేంద్రమోడీ భేటీ బచావో, భేటీ పడావో పథకాన్ని ప్రారంభించనట్లు ఆయన తెలిపారు.
అనంతరం దీనిపై కొంత చర్చ జరిగిన తర్వాత పార్లమెంటరీ సహాయ మంత్రి అబ్బాస్ నఖ్వీ, కేసీ త్యాగితో ఇంకా మీ వద్ద ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయని ప్రశ్నించారు. దీంతో వెంటనే ప్రతిపక్ష సభ్యులు కలగజేసుకుని దివ్యా ఫార్మసీ లైసెన్సుని రద్దు చేయాల్సిందిగా కోరారు. చివరకు చర్చ జరిగిన విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పీకర్తో ప్రకటన చేయించింది.