సంఖ్య తక్కువుందన్న ఆందోళన వద్దు..విపక్షాల సలహాలు అమూల్యమైనవి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎన్డీఏకు అధిక సీట్లు ఉన్నప్పటికీ విపక్షాలు ఇచ్చే సూచనలను సలహాలను సీరియస్గా తీసుకుని పనిచేస్తామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. 17వ పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. పార్లమెంటులో విపక్షాలు కీలక పాత్ర పోషించాలని ప్రధాని ఆకాంక్షించారు. తమకు వచ్చిన సంఖ్యాబలం గురించి పట్టించుకోకుండా ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలని చెప్పారు. వారి మాటలను సీరియస్గా తీసుకుంటామని అన్నారు.
ఇక పార్లమెంటులోకి అడుగుపెట్టినప్పుడు తాము అధికారపక్షం, లేదా విపక్షం అనే మాటను మరిచిపోయి కేవలం ప్రజల సమస్యలపై నిష్పక్షపాతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.దేశ ప్రయోజనాలపై దృష్టి పెట్టి అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ప్రధాని మోడీ. పార్లమెంటు సజావుగా సాగితేనే దేశ ప్రజల యొక్క అవసరతలను త్వరగా తీర్చేందుకు సాధ్యమవుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం రోజున జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో కూడా ప్రధాని మోడీ అన్ని పార్టీల నేతలకు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. విబేధాలు పక్కనబెట్టి ప్రజాశ్రేయస్సుకు పనిచేసేలా కలిసి పనిచేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు.
ఇక జూలై 26 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్బిల్లు, బ్యాంక్ ఖాతా తెరిచేందుకు, మొబైల్ ఫోన్ నెంబర్ కరెక్షన్లకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసేలా చట్టం తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక రైతు సమస్యలు, నిరుద్యోగం, కరువులాంటి సమస్యలపై కూడా చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇదిలా ఉంటే జూలై 5న కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్ తలాక్పై నిషేధం విధిస్తూ తాజా బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఆర్డినెన్స్ను తొలగించి ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. కొత్తగా తీసుకువస్తున్న చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తికి మూడేళ్లు జైలుశిక్ష విధించనున్నట్లు ఉంది. అయితే 16వ లోక్సభలోనే బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ రాజ్యసభలో బిల్లు పెండింగ్లో పడిపోవడం.. ఆ తర్వాత 16వ లోక్సభ రద్దు కావడంతో బిల్లు కూడా రద్దు అయ్యింది.